logo

వైకల్యం జయించి.. పతకాలు సాధించి

నోట్లో ముద్ద పెట్టుకోవడానికి సహకరించని చేతులు.. ఉబికి వచ్చే కన్నీళ్లను తుడుచుకోలేని దుస్థితి. అయ్యో! వీడి జీవితం ఇలా అయ్యిందేనని తల్లిదండ్రుల మనసులో గూడుకట్టుకున్న నిరాశ..

Published : 30 Nov 2022 06:32 IST

పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బాలుడి సత్తా
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ క్రీడావిభాగం


2017లో బీఎస్‌ఎఫ్‌ డీజీ కిషన్‌కుమార్‌శర్మతో శ్రీనికేష్‌

నోట్లో ముద్ద పెట్టుకోవడానికి సహకరించని చేతులు.. ఉబికి వచ్చే కన్నీళ్లను తుడుచుకోలేని దుస్థితి. అయ్యో! వీడి జీవితం ఇలా అయ్యిందేనని తల్లిదండ్రుల మనసులో గూడుకట్టుకున్న నిరాశ.. జాలిగా చూసే జనాలు. జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న సమయంలో దొరికిన ఆధారంతో జాతీయ స్థాయిలో సత్తా చాటి తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు నిజామాబాద్‌ నగరం గౌతమ్‌నగర్‌కు చెందిన దివ్యాంగ బాలుడు శ్రీనికేష్‌ కిరణ్‌.

తండ్రి కిరణ్‌కుమార్‌ బీఎస్‌ఎఫ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి శ్రీవాణి గృహిణి. 2008లో శ్రీనికేష్‌ రెండు చేతులు పూర్తి ఆకృతిలో లేకుండా పుట్టాడు. కిరణ్‌కుమార్‌ విధి నిర్వహణలో భాగంగా బెంగళూరులో ఉంటున్నారు. అక్కడి కేంద్రీయ విద్యాలయంలో బాలుడు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
మలుపు తిప్పిన ఘట్టం..: దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా తమకంటూ ప్రత్యేకత చాటుకునేలా 2017లో బీఎస్‌ఎఫ్‌ డీజీ కిషన్‌కుమార్‌శర్మ పలు కార్యక్రమాలు రూపొందించారు. సదరు అధికారి సూచనతో తల్లిదండ్రులు బాబుకు ఈత, చిత్రలేఖనం, షూటింగ్‌లో శిక్షణ ఇప్పించారు.

సాధించిన పతకాలు..: ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన 21వ జాతీయ పారా ఈత పోటీల్లో శ్రీనికేష్‌ మూడు పతకాలు సొంతం చేసుకున్నాడు. ఇటీవల అస్సాంలో నిర్వహించిన 22వ జాతీయ పోటీల్లో 400 మీ. ఫ్రీస్టైల్‌ విభాగంతో పాటు 50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో రెండు స్వర్ణాలు, 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజతం అందుకున్నాడు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా బీఎస్‌ఎఫ్‌ నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో మొదటిస్థానంలో నిలిచాడు. బీఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి అందరి మన్ననలు పొందాడు.

ఎప్పుడూ బాధపడను: - శ్రీనికేష్‌ కిరణ్‌

ఈ విజయాలు ఎంతో స్ఫూర్తిని నింపా యి. దివ్యాంగుడినని నేనెన్నడూ బాధపడను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే అంతర్జాతీయ వేదికపై సత్తాచాటి దేశానికి పతకాలు సాధిస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని