ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
నిజామాబాద్లో వెలుగుచూసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఆ శాఖ ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది.
అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం
ఈనాడు - నిజామాబాద్, న్యూస్టుడే, ఇందూరు సిటీ
నిజామాబాద్లో వెలుగుచూసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఆ శాఖ ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు సహాయకులు, అర్బన్ కార్యాలయంలో ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ జిల్లా రిజిస్ట్రార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరదీసిన ఉదంతం ఇటీవల నిజామాబాద్లో వెలుగుచూసింది. రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందితో కలిసి ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించారు. ఇతరుల పేరున ఉన్న ఖాళీ స్థలాలు, ఇళ్లను వారి ప్రమేయం లేకుండానే మరొకరికి విక్రయించినట్లు దస్తావేజులు సృష్టించారు. ఏకంగా ఈసీ పత్రాలతో పాటు ఆన్లైన్లో కూడా వివరాలన్నింటిని మార్చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని ‘ఈనాడు’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. తదనంతరం ఉన్నతాధికారులు ఆరా తీశారు. డీఐజీ మధుసూదన్ రెడ్డి పలుమార్లు జిల్లాకు వచ్చి విచారించారు.
డిజిటల్ కీ ద్వారానే..
ఒకసారి దస్తావేజు తయారైన తర్వాత తిరిగి అందులో మార్పులు, చేర్పులు చేయటం అంత సులువు కాదు. ఇందుకోసం జిల్ల్లా రిజిస్ట్రారు అనుమతి తప్పనిసరి. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఆయనకు సంబంధించిన డిజిటల్ కీ ద్వారానే జరుగుతుంది. ఇదే కీని అక్రమార్కులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీన్ని ఎప్పుడెప్పుడు? ఎవరెవరు వినియోగించారు? అందుకు సంబంధించి ఉత్తర్వుల కాపీలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్రిమినల్ కేసు నమోదు చేస్తేనే అక్రమ దస్తావేజులు తయారు చేయించిన బయటి వ్యక్తులు ఎవరన్నది తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.