logo

ఫొటోతీసి సోదిక్లాస్‌ అని పోస్టు పెడతావా?

పాఠం చెప్తున్నప్పుడు ఫొటో తీసి..‘సోది క్లాస్‌’ అని పేర్కొంటూ ఒక విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు ఆమెతో పాటు తరగతిలోని మరికొందరు అమ్మాయిలను చితకబాదారు.

Published : 30 Nov 2022 06:35 IST

విద్యార్థినిపై ఆగ్రహించి చితకబాదిన ఉపాధ్యాయురాలు
తల్లిదండ్రుల ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు

ఆందోళన చేస్తున్న విద్యార్థులు

మద్నూర్‌, న్యూస్‌టుడే: పాఠం చెప్తున్నప్పుడు ఫొటో తీసి..‘సోది క్లాస్‌’ అని పేర్కొంటూ ఒక విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు ఆమెతో పాటు తరగతిలోని మరికొందరు అమ్మాయిలను చితకబాదారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌ ఆదర్శ (మోడల్‌) పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు నాలుగు రోజుల క్రితం తెలుగు ఉపాధ్యాయురాలు మహేశ్వరి పాఠం బోధిస్తుండగా ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసింది. ‘సోది క్లాస్‌’ అని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి సెల్‌ఫోన్‌ తీసుకురావడమే కాకుండా..తన ఫొటో ఎందుకు తీశావని నిలదీశారు. దాంతో విద్యారిన్థి తప్పయింది.. క్షమించండని వేడుకుంది. అయినప్పటికీ ఆగ్రహం తగ్గని ఉపాధ్యాయురాలు గది తలుపులు పెట్టి అమ్మాయిలను ఒకచోట నిలబెట్టి కొందరిని కర్రతో చితకబాదారు. ఈ ఘటనను కొందరు బాలురు వీడియో తీశారు. బాలికలు బోరున విలపిస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయురాలితో వాగ్వాదానికి దిగారు. ఆమెను సస్పెండ్‌ చేయాలని ధర్నా చేశారు. ఈ విషయంపై మహేశ్వరిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. సామాజిక మాధ్యమంలో తన ఫొటో పెట్టినందుకు కొట్టిన మాట వాస్తవమేనని తెలిపారు. ప్రిన్సిపల్‌ లావణ్యను సంప్రదించగా.. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలు మహేశ్వరిపై ఓ విద్యార్థిని మంగళవారం సాయంత్రం మద్నూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని