logo

ఆహార భద్రత అంతంతే

నాసిరకం ఆహార పదార్థాలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఏడు వేలకు పైగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, తదితర దుకాణాలు ఉంటే.. ఆహార శాఖ అనుమతులు పొందినవి కేవలం నాలుగు వేలే.

Published : 06 Dec 2022 06:21 IST

ఉమ్మడి జిల్లాలో 129 నమూనాలే సేకరణ
ఏడాదంతా 15 కేసులే
ఉన్నది ఇద్దరు అధికారులే

నమూనాలు సేకరిస్తున్న అధికారులు

నాసిరకం ఆహార పదార్థాలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఏడు వేలకు పైగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, తదితర దుకాణాలు ఉంటే.. ఆహార శాఖ అనుమతులు పొందినవి కేవలం నాలుగు వేలే. అవగాహన లేక కొందరు, రుసుము చెల్లించలేక మరికొందరు అనుమతులకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కల్తీ విక్రయం యథేచ్ఛగా సాగుతోంది.


నిజామాబాద్‌ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 59 నమూనాలు సేకరించగా ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు జరిమానా కేసులు కాగా మరో రెండు జైలుకెళ్లేవి ఉన్నాయి. కామారెడ్డిలో 70 నమూనాలు సేకరించగా 10 కేసులయ్యాయి. నాలుగు జైలుకెళ్లేవి, ఆరు జరిమానావి. ల్యాబ్‌ నివేదికల ఆధారంగా జరిమానాలు, శిక్షలు వేస్తారు. లైసెన్స్‌ లేకుంటే రూ.5 లక్షలు, ఆర్నెల్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.


న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం: కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు ఇద్దరే అధికారులు ఉన్నారు. 5 నుంచి 10 నమూనాలు సేకరించడం, వీటిని హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపడం, నివేదికల ఆధారంగా కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడంతోనే వీరికి సరిపోతుంది.

ఇష్టారాజ్యంగా విక్రయాలు

మిఠాయి దుకాణాలు, హోటళ్లు మినహాయిస్తే కర్రీ పాయింట్లు, జూస్‌ సెంటర్లు, పానీపూరి బండ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. నాసిరకం సామగ్రితో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. అప్పటికప్పుడు ప్రమాదం లేకున్నా.. దీర్ఘకాలికంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.

ఇక వాహనంలోనే పరీక్షలు

ఆహార పదార్థాల తనిఖీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం జిల్లాకు ప్రత్యేక వాహనం కేటాయించింది. వ్యాపార సముదాయాలు ఉన్నచోటకు వెళ్లి నమూనాలు సేకరించి అక్కడే పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సాధ్యపడని నమూనాలు హైదరాబాద్‌కు పంపనున్నారు.


తనిఖీలు చేస్తున్నాం
- నాయక్‌, ఆహార భద్రత అధికారి

గత ఏడాది కాలంగా ఉమ్మడి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ప్రతి దుకాణదారుడు లైసెన్స్‌ తీసుకోవాలి. లేదంటే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వాహనం కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని