logo

బుజ్జగింపుల పర్వం ప్రారంభం..!

ఎల్లారెడ్డి పురపాలిక అసంతృప్త భారాస సభ్యులు ఇంకా బెట్టు వీడలేదు. క్యాంపునకు వెళ్లిన వారు ఇంకా చేరలేదు. పార్టీ నాయకులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Published : 08 Feb 2023 05:40 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఎల్లారెడ్డి పురపాలిక అసంతృప్త భారాస సభ్యులు ఇంకా బెట్టు వీడలేదు. క్యాంపునకు వెళ్లిన వారు ఇంకా చేరలేదు. పార్టీ నాయకులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బృందంలో ఉన్నవారు తమ అభిప్రాయాలు, డిమాండ్లను ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఛైర్మన్‌ను మార్చడంతో పాటు నిధుల కేటాయింపు, బల్దియాలో కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయడంలో అధికారుల నిర్లక్ష్యం వంటి డిమాండ్లలో వేటికి సానుకూలమో నాయకత్వం నుంచి వచ్చే సమాధానం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. గోవా యాత్రలో ఉన్న అసంతృప్త కౌన్సిలర్లలో ఇద్దరిని తమ దారికి తెచ్చుకునేందుకు ఛైర్మన్‌ వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆ బృందంలోని ఓ  కౌన్సిలర్‌ తండ్రితో ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ మంతనాలు సాగించినట్లు సమాచారం. సదరు కౌన్సిలర్‌ మెత్తబడినట్లు తెలిసింది. ఇదే విధంగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందిన మరో కౌన్సిలర్‌ సైతం ఆయన చెప్పినట్లుగానే నడుచుకుంటానని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్‌ వర్గంలో ఉన్న ఇద్దరు కౌన్సిలర్ల మద్దతు కోసం ఛైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించేందుకు సిద్ధపడిన కౌన్సిలర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డిమాండ్ల పరిష్కారానికి అసంతృప్త కౌన్సిలర్లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణంలో ఎమ్మెల్యే సమస్యను ఎలా పరిష్కరిస్తారనే అంశంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని