logo

కొవిడ్‌తో 20 వేల మంది మృతి

శాసనసభ గురువారం ప్రశాంతంగా కొనసాగింది. సభాపతి బిక్రంకేసరి అరుఖ్‌ తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

Published : 02 Dec 2022 03:30 IST

రెవెన్యూ, విపత్తుల నివారణ మంత్రి ప్రమీలా మల్లిక్‌

కొనసాగుతున్న సభ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: శాసనసభ గురువారం ప్రశాంతంగా కొనసాగింది. సభాపతి బిక్రంకేసరి అరుఖ్‌ తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు రెవెన్యూ, విపత్తుల నివారణ మంత్రి ప్రమీలా మల్లిక్‌, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి తుషారకాంతి బెహర, జలవనరులు, వాణిజ్య, రవాణాశాఖల మంత్రి టుకుని సాహు సమాధానాలిచ్చారు.


కొరాపుట్‌ ఇబ్బందులు ప్రస్తావించిన తారా

జయపురం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినీపతి కొరాపుట్‌ జిల్లాలో కొండకోనల్లో ఉన్న గ్రామాల (పొడాలు)కు రెవెన్యూ హోదా లేకపోవడంతో మొబైల్‌, ఇతర సేవలు అందడం లేదన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల బినామీ స్థలాలు, మ్యుటేషన్‌ ఇబ్బందులు ప్రస్తావించారు. దీనిపై మంత్రి ప్రమీలా మాట్లాడుతూ రెవెన్యూ హోదా లేని గ్రామాలకు సౌకర్యాల్లో ఎలాంటి కొరత ఉండదన్నారు. మొబైల్‌ నెట్‌ వర్క్‌ సేవలకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి రెవెన్యూ శాఖ ఇబ్బందులపై అధ్యయనం చేస్తామని తెలిపారు. కొవిడ్‌తో రాష్ట్రంలో 20 వేల మంది మృతి చెందారని ప్రమీలా చెప్పారు. గడిచిన అయిదేళ్లలో ఇతర విపత్తులు (వరదలు, తుపానులు) వల్ల 14,407 మంది మరణించారన్నారు. గత దశాబ్దకాలంలో విపత్తుల వల్ల రాష్ట్రానికి రూ.40 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. తరచూ దాడి చేస్తున్న విపత్తుల సమయంలో ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.


క్రీడలకు ప్రాధాన్యం

అనంతరం క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషారకాంతి బెహర సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలోని 314 సమితులకు గాను ఇంతవరకు 282 సమితుల్లో క్రీడామైదానాల పనులు పూర్తయినట్లు చెప్పారు. స్థలం కొరత వల్ల 13 చోట్ల పనులు ప్రారంభం కాలేదన్నారు. ఒక్కో మైదానానికి రూ.20 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. సమితి కేంద్రాల్లో గ్రామీణ యువతీ యువకులు, స్కూలు పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెంచి, క్రీడాకారులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు.


మహానది ఎండుతోంది

తర్వాత జలవనరులు, వాణిజ్యం, రవాణా శాఖల మంత్రి టుకుని సాహు మాట్లాడుతూ... ఉత్తరకోస్తా జిల్లాల జీవధార మహానది వేసవిలో ఎండుతోందని, పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌ ప్రవాహాన్ని అడ్డుకుంటోందన్నారు. ఏకపక్షంగా నదిపై భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, వేసవిలో గేట్లు మూసివేస్తున్నందున రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని, ట్రైబ్యునల్‌ ఈ వివాదం పరిశీలిస్తోందని తెలిపారు.


ఇబ్బందులు అధిగమించి ముందంజ

ప్రశ్నోత్తరాల తర్వాత భాజపా ప్రవేశపెట్టిన ‘సమాన పనులకు సమాన వేతనాలు’ అన్న అంశంపై మధ్యాహ్నం సుదీర్ఘ చర్చ జరిగింది. విపక్ష సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, సమానంగా పనులు చేస్తున్న ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం ఉంటోందని ఆరోపించారు. దీనికి సమాధానమిచ్చిన మంత్రి ప్రమీలా 2000లో అధికారానికొచ్చిన బిజద ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు చవిచూసిందన్నారు. 1999 ప్రచండ తుపాను రాష్ట్రంలోని సగం జిల్లాల్లో విధ్వంసం సృష్టించగా, పునర్మిర్మాణాలకు ఎక్కువ మొత్తం అవసరమైందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్థికశాఖ ప్రణాళికా స్వరూపం పెంచి, ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ శాఖల్లో పలువురిని ఒప్పంద ఉద్యోగులుగా నియమించిందన్నారు. ఇటీవల కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడడంతో 57 వేల ఒప్పంద ఉద్యోగులను ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రెగ్యులర్‌ చేశారన్నారు. ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారంతా త్వరలో రెగ్యులర్‌ అవుతారని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని