logo

ప్చ్‌.. ఈ సారీ నిరాశే

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంటులో 2023-24 బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. పలు రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. మునుపెన్నడూ లేనంతగా రైల్వే రంగానికి కేటాయింపులు చేశారు.

Updated : 02 Feb 2023 02:36 IST

రాష్ట్రానికి బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యం
న్యూస్‌టుడే, భువనేశ్వర్‌

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంటులో 2023-24 బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. పలు రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. మునుపెన్నడూ లేనంతగా రైల్వే రంగానికి కేటాయింపులు చేశారు. రాష్ట్రానికి ప్రత్యక్షంగా ఏమీ లేకపోవడం నిరాశపరిచినా.. పరోక్షంగా కొత లబ్ధి చేకూరుతుందని, మొత్తంగా చూసుకుంటే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని భాజపా నేతలు అంటుంటే.. పర్వాలేదని ఆర్థిక నిపుణులు, అంకెల గారడని విపక్ష నేతలు అభిప్రాయ పడ్డారు.  


మారుమూల ప్రాంతాలకు ఉపయుక్తం

పీఎంఏవైకి రూ.79వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించడంతో నిరాశ్రయులకు గృహాలు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారని అందులో కనీసం 2 నుంచి 3 విమానాశ్రయాలు నిర్మించినా.. రాకపోకలకు సుగమం అవుతుందని తెలిపారు. పంచాయతీల్లో ప్రాంతీయ భాషల్లో డిజిటల్‌ గ్రంథాలయాల ఏర్పాట్లు నిర్ణయం అభినందనీయమని దాని వలన రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న యువతకు ఎంతో ఉపయుక్తంగా మారుతుందని, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని చెప్పారు.


రైల్వే రంగంపై ఆశలు

హరిత ఉత్పత్తులు(గ్రీన్‌ గ్రోత్‌), స్వదేశీ ఉత్పత్తులు, పర్యాటక వికాసం, డిజిటల్‌ రంగాలకు కేటాయించిన నిధుల వలన పరోక్షంగా ఒడిశాకు లబ్ధి చేకూరనుంది. రైల్వే రంగానికి రూ.2.40లక్షల కోట్లు కేటాయించగా అందులో ఎక్కువగా రాష్ట్రానికి లబ్ధి చేకూరవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా.


అంకెల గారడీ

కాంగ్రెస్‌ సభాపక్షం (సీఎల్పీ)నేత నర్సింగ మిశ్ర విలేకరులతో మాట్లాడుతూ... 2023-24లో 7 శాతం వృద్ధిరేటు ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెలగారడి అని విమర్శించారు. ఈ ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ, 2024 సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసిన బడ్జెట్‌లో పేదలకు ఉపయోగపడేవి కాన రాలేదన్నారు. ఆరోగ్యం, మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు.


ఉపాధి అవకాశాలు

భువనేశ్వర్‌ ఉత్కళ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(యూసీసీ) అధ్యక్షుడు బ్రహ్మానంద మిశ్ర విలేకరులతో మాట్లాడుతూ... ఎంఎస్‌ఎంఈ, అంకురాలకు(స్టార్టప్‌) బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చిచ్చారని యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. స్వదేశీమాల్స్‌, పర్యటకాభివృద్ధి ధ్యేయంగా దేఖో అప్నాదేశ్‌, స్వదేశ్‌ దర్శన్‌ కార్యక్రమాలు లాభిస్తాయన్నారు.


నమ్మకం లేదు

బిజదనేత శశిభూషణ్‌ మహంతి విలేకరులతో మాట్లాడుతూ... ఒడిశాకు ప్రత్యేకించి ఏమీ లేదన్నారు. ద్రవ్యోల్బనం నియంత్రించడానికి ఆర్థికమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిత్యావసర సామగ్రి ధరలు తగ్గుతాయన్న నమ్మకం లేదన్నారు.


గిరిజన గ్రామాల ప్రగతికి బాటలు..

నిర్మలమ్మ ఈసారి గిరిజనుల వికాసానికి రూ.15వేల కోట్లు కేటాయించారు. దీంతోపాటు ‘ఏకలవ్య’ విద్యాలయాల్లో ఉపాధ్యాయుల నియామకాలు, వసతులకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. కేటాయించిన నిధుల్లో ఒడిశాకు అధిక నిధులు విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ 22శాతం ఆదివాసీలు ఉన్న విషయం విదితమే.


పసిడి ధర పెరుగుదల బాధించింది

సాగర్‌ గ్యాస్‌ ఏజన్సీ(గోపాల్‌పూర్‌) సంచాలకురాలు కె.రోజా ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... అధికోత్పత్తులు, ఉపాధి కల్పన ధ్యేయంగా మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బాగుందన్నారు. పసిడి, వెండి ధరలు పెరుగుదల బాధించిందని, వంటగ్యాసు, డీజిల్‌, పెట్రోలు సుంకాలు తగ్గించి ఉంటే బాగుండేదన్నారు.


ప్రయోజనమే

బరగఢ్‌(భాజపా) ఎంపీ సురేష్‌ పూజారి దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకొంటున్న వేళ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా మారుతుందన్నారు. రైల్వే రంగానికి భారీగా కేటాయింపులు జరిగాయని ఒడిశాకు అందులో సంతృప్తికర శాతం దక్కుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని