logo

ఎదురు కాల్పుల్లో వేటగాడి హతం

మయూర్‌భంజ్‌ జిల్లా సిమిలిపాల్‌ అభయారణ్యంలో అటవీ శాఖ సిబ్బంది, వేటగాళ్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జగన్నాథ్‌ హేంబ్రం అనే వేటగాడు మృతి చెందాడు.

Published : 03 Jun 2023 02:49 IST

మృతి చెందిన జగన్నాథ్‌ హేంబ్రమ్‌

కటక్‌, న్యూస్‌టుడే: మయూర్‌భంజ్‌ జిల్లా సిమిలిపాల్‌ అభయారణ్యంలో అటవీ శాఖ సిబ్బంది, వేటగాళ్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జగన్నాథ్‌ హేంబ్రం అనే వేటగాడు మృతి చెందాడు. బుధవారం రాత్రి బంగిరి పూసి, చాహలా అటవీ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న అటవీ సిబ్బందికి 15మంది వేటగాళ్లు తుపాకులు, విల్లంబులతో ఎదురు పడ్డారు. అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా వేటగాళ్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన అటవీ సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా వేటగాడు జగన్నాథ్‌ మృతి చెందాడు. గురువారం ఉదయం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని బరిపద జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన కుమారుడు అడవిలోకి ఆవులను మేపేందుకు తీసుకెళ్లాడని వేటగాడు కాదని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అటవీ సిబ్బంది అతడిని కావాలని హతమార్చారని పేర్కొంటున్నారు.


చీర ధరించి ఖైదీ పరారీ

కటక్‌, న్యూస్‌టుడే: కటక్‌ ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీ పోలీసుల కళ్లుగప్పి శుక్రవారం పరారయ్యాడు. మంగళబాగ్‌ పోలీసులు గాలింపు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కటక్‌ నియలి ప్రాంతంలో మే 27న దొంగతనానికి పాల్పడిన సజన దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా బెయిల్‌ లభించక పోవడం చౌదువార్‌ కారాగారానికి తరలించారు. రెండు రోజుల క్రితం అతడు అనారోగ్యానికి గురవ్వడంతో చికిత్స నిమిత్తం ఎస్సీబీ వైద్య కళాశాలలో చేర్పించారు. ఆరుగురు జైలు సిబ్బందిని కాపలాగా ఉంచారు. శుక్రవారం ఉదయం బాత్రూంకు వెళ్లిన ఖైదీ బట్టలు విప్పేసి అక్కడ ఉన్న చీర ధరించి జారుకున్నాడు. చీర కట్టుకోవడంతో సిబ్బంది గుర్తించలేకపోయారు. కొంత సేపటి తరువాత వార్డు లోపలికి వెళ్లి చూడగా ఖైదీ కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి, గాలింపులు ప్రారంభించారు. చీరను అతడికి ఎవరు అందించారో దర్యాప్తు చేస్తున్నారు.


గోడ కూలి గాయపడిన ఇద్దరు మృత్యువాత

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి ప్రాంతంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు పట్టణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఎయిర్‌ స్ట్రిప్‌ వద్ద గోడ కూలిన ఘటనలో గాయపడిన 10 మంది కూలీల్లో ఇద్దరు మృతిచెందారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ కటేలిగుడకు చెందిన మనోజ్‌ హేమ్రం(28), తిలత్తమ భుమియా(26) శుక్రవారం మృతి చెందారు. మిగిలిన 8 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం తరలించి ముల్కాన్‌గిరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఉపాధ్యాయురాలి ఆత్మహత్య

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: నవరంగపూర్‌ జిల్లా ఉమ్మర్‌కోట్‌ సమితిలో ప్రభుత్వ ఐటీఐ గ్రంథాలయంలో ఉపాధ్యాయురాలు జయలక్ష్మి అహ్మద్‌(42) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ కళాశాలలో పద్నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న ఈమె కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. నాలుగు నెలలు మెడికల్‌ లీవ్‌ తీసుకొని 15 రోజుల క్రితం తిరిగి విధులకు హాజరయ్యారు. ప్రస్తుతం ఫార్మాఫిల్‌ అప్‌లు జరుగుతుండటంతో గత రెండు రోజులుగా గ్రంథాలయంలో ఉంటూ విద్యార్థులకు పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. ఈ పనిలో నిగమగ్నమై ఇంటికి కూడా వెళ్లలేదు. శుక్రవారం ఈమె భర్త భరత్‌ చంద్ర భోజనం పట్టుకొని వచ్చి చూసేసరికి ఫంకాకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించారు. ఉపాధ్యాయురాలి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. భర్త భరత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరణోత్తర పరీక్షల నిమిత్తం జయలక్ష్మి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది మార్చి 3న ఇదే కళాశాలకు చెందిన విద్యార్థిని నాగేశ్వరి గండ్‌ వసతిగృహంలో ఆత్మహత్య చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని