logo

మారణాయుధాలు స్వాధీనం: ఆరుగురి అరెస్టు

నువాపడ జిల్లా ధరమ్‌బంధ ఠాణా పరిధిలోని అమనర గ్రామంలో ఇటీవల కలకలం రేపిన ఘటనలో దోపిడీ ముఠా సభ్యుల్ని 48 గంటల్లో పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. ఆరుగుర్ని అరెస్టు చేసి శనివారం న్యాయస్థానానికి తరలించారు.

Published : 04 Jun 2023 02:21 IST

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: నువాపడ జిల్లా ధరమ్‌బంధ ఠాణా పరిధిలోని అమనర గ్రామంలో ఇటీవల కలకలం రేపిన ఘటనలో దోపిడీ ముఠా సభ్యుల్ని 48 గంటల్లో పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. ఆరుగుర్ని అరెస్టు చేసి శనివారం న్యాయస్థానానికి తరలించారు. నిందితుల నుంచి రెండు కత్తులు, ఓ చాకు, ద్విచక్ర వాహనం, ఆరు మొబైల్‌ ఫోన్లు, హాక్స్‌సా బ్లేడు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం నువాపడ ఠాణాలో జరిగిన విలేకరుల సమావేశంలో నువాపడ ఎస్పీ రెడ్డి రాఘవేంద్ర గుండాల ఆ వివరాలు తెలిపారు. బుధవారం వేకువన (మే 31వ తేదీ) సుమారు 3 గంటల సమయంలో అమనర గ్రామంలోని మోతిన్‌ బాల సాహు ఇంటి గ్రిల్‌ గేటు విరిచి నలుగురైదుగురు దుండగులు బలవంతంగా లోనికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సాహును వారు కత్తితో బెదిరించి లాల్‌ సలామ్‌ అంటూ రెండు ప్యాకెట్ల బియ్యం, ఒక నూనె డబ్బా ఇవ్వాలని అడిగారు. అదే సమయంలో ఆమె కుమారులు రావడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. కలకలం రేపిన ఈ ఘటనపై ఎస్పీ రాఘవేంద్ర పర్యవేక్షణలో నువాపడ ఎస్డీపీఓ పి.కె.పట్నాయక్‌, ధరమ్‌బంధ, జంక్‌, లఖన, నువాపడ ఠాణాల అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖలరి, రాయ్‌పూర్‌, బఘబహర తదితర చోట్ల దాడులు జరిపిన పోలీసు బృందం నిందితుల్ని అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని