logo

జగనన్న కాలనీలకు వెలుగులెక్కడ

ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు సంతోషించారు. కష్టపడి నిర్మించుకున్నారు.. శ్రావణమాసం కదా.. మంచి ముహూర్తాలు ఉండటంతో అందరినీ పిలుచుకొని

Published : 06 Aug 2022 04:45 IST

పార్వతీపురం మండలం చినబొండపల్లి లేఅవుట్‌లో 39 మందికి పట్టాలు అందించారు. మండలంలో ఇక్కడే ముందుగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. కాలనీ వరకు విద్యుత్తు సదుపాయం కల్పించినా.. గృహావసరాలకు మాత్రం కనెక్షన్‌ ఇవ్వలేదు. ఓ లబ్ధిదారు తన సొంత ఖర్చుతో బోరు తవ్వించుకుని గోడలు తడుపుకోవడానికి కరెంటు లేక జనరేటర్‌ను అద్దెకు తెచ్చుకున్నారు.


మక్కువ మండల కేంద్రంలోని లేఅవుట్‌లో 320 గృహాలను కేటాయించారు. సుమారు 15 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఓ వీధిలో వరుసగా స్తంభాలు వేసినా కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ నీటి అవసరాలకు చేతిపంపులపై ఆధారపడుతున్నారు.

ఈనాడు-విజయనగరం, సాలూరు, పార్వతీపురం గ్రామీణం, మక్కువ, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు సంతోషించారు. కష్టపడి నిర్మించుకున్నారు.. శ్రావణమాసం కదా.. మంచి ముహూర్తాలు ఉండటంతో అందరినీ పిలుచుకొని గృహ ప్రవేశం చేద్దామనుకుంటే విద్యుత్తు సదుపాయం లేకపోవడంతో అడుగు పెట్టలేని పరిస్థితి.

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నిరుపేదలకు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా వందలాది మంది పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 906 లేవుట్లకు గాను 269 లేఅవుట్లను ప్రాధాన్య క్రమంలో ఎంచుకొని విద్యుద్దీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 85 చోట్ల ప్రారంభించగా 25 చోట్ల ఈ నెలాఖరులోగా, మిగతావి సెప్టెంబరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతానికి 35 వేల విద్యుత్తు స్తంభాలు, 3 వేల నియంత్రికలు అవసరమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో నిర్మాణాలకు నీటి అవసరాలు తీరుతున్నాయి. ఇళ్లకు మాత్రం కనెక్షన్లు ఇవ్వనందున లబ్ధిదారులు చేరడానికి ఆస్కారం లేకుండా పోతుంది.

సాలూరులోని నెల్లిపర్తి-2 లేఅవుట్‌ ఇది. ఇక్కడ 218 మందికి ఇళ్లను కేటాయించారు. మూడిళ్లు పూర్తి కాగా.. ఒకరు గృహ ప్రవేశం చేశారు. కాలనీల్లో స్తంభాలు వేసి వదిలేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వేసిన బోర్లకు సమీపంలోని లైన్‌ నుంచి తాత్కాలికంగా కనెక్షన్‌ ఇచ్చారు.
వృథాగా మోటార్లు
నీరు లేకుండా నిర్మాణాలు సాధ్యం కావని అధికారులు అన్నిచోట్లా బోర్లు వేశారు. తక్కువ గృహాలు ఉన్న చోట చేతిపంపులు బిగించారు. మిగతా ప్రాంతాల్లో బోర్ల ఏర్పాటుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల వద్ద మోటార్లు సిద్ధంగా ఉన్నా విద్యుత్తు లేక ఆగిపోయారు. కొన్నిచోట్ల బిగించినవి వృథాగా ఉండిపోయాయి. ఇప్పటివరకు ఏ ఒక్క కాలనీలోనూ విద్యుద్దీకరణ పనులు పూర్తిస్థాయిలో కాలేదు.  అయినప్పటికీ నిర్మాణాలు ప్రారంభించకపోతే పట్టాలు రద్దు చేస్తామని అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడంతో కొందరు అప్పులు చేసి పనులు మొదలెట్టారు.


వేగవంతం చేస్తున్నాం: జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు వేగవంతం చేస్తున్నాం. ఈ నెలాఖరులో కొన్ని పూర్తవుతాయి. ఆయా చోట్ల కనెక్షన్లు ఇచ్చేస్తాం. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. 

 - నాగేశ్వరరావు, ఎస్‌ఈ, విద్యుత్తు శాఖ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని