logo

ఉచిత బియ్యానికి ఎగనామం

జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీ నిలిచిపోయింది.

Published : 06 Feb 2023 04:29 IST

నిలిచిపోయిన పీఎంజీకేఏవై

రెండింటినీ కలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం

రేషన్‌ పంపిణీ (పాత చిత్రం)

విజయనగరం కలెక్టరేట్‌/భామిని, న్యూస్‌టుడే: జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీ నిలిచిపోయింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నుంచి పేదవర్గాలకు, ఏఏవై కార్డుదారులకు కేంద్ర వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బియ్యాన్ని(నాన్‌ సార్టెక్స్‌) పంపిణీ చేస్తోంది. చౌకధరల దుకాణాల ద్వారా వీటిని అందజేసేవారు. కేంద్రం ఇస్తున్నా.. కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వీటి పంపిణీని నిలిపివేసింది. మధ్యలో ఒకట్రెండు నెలలు ఇచ్చినా... ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వీటి ఊసే లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్‌ కింద ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికే రేషన్‌ పంపిణీలో భాగంగా ప్రతి నెలా ఒకటి నుంచి 17వ తేదీ వరకు రాయితీపై సరకులు పంపిణీ చేస్తోంది. కిలో బియ్యానికి రూపాయి చొప్పున, కందిపప్పు, పంచదార రాయితీపై ఇచ్చేవారు. ఈ నెల నుంచి పట్టణ ప్రాంతాల్లో కార్డుదారులకు రెండు కిలోల చొప్పున గోధుమపిండి అదనంగా సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యాన్ని 18 నుంచి 30వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా అందజేసేవారు.

నిలిపివేత

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఇదే సందర్భంలో కేంద్రమిస్తున్న పీఎంజీకేఏవై పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్ర పౌరసరఫరాల అధికారుల నుంచి దీనిపై ఎటువంటి ఉత్తర్వులూ రాకపోవడంతో పంపిణీ నిలిపివేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు.  వెనుకబడిన జిల్లా కావడంతో విజయనగరంలో ఏఏవై(పీఎంజీకేఏవై లబ్ధిదారులు) కార్డుదారులు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం విజయనగరం జిల్లాలో సాధారణ బియ్యం కార్డులు 5.74 లక్షలు ఉంటే.. అందులో పీఎంజీకేఏవై లబ్ధిదారుల కార్డులు 5.71 లక్షలు ఉన్నాయి.

పార్వతీపురం మన్యంలో: 578 రేషన్‌ దుకాణాల పరిధిలో 2,76,783 కార్డులున్నాయి. కార్డులోని ఒక్కో సభ్యునికి 5 కిలోల చొప్పున నాన్‌ సార్టెక్స్‌ బియ్యం అందేది. ఒక కార్డులో నలుగురు సభ్యులుంటే 20 కిలోల బియ్యం వచ్చేవి. ఈ రకం బియ్యం బయట కొనాలంటే రూ.25 నుంచి రూ.30 వరకూ వెచ్చించాలి. ప్రస్తుతం ప్రభుత్వం పీడీఎస్‌నే ఉచితంగా ఇచ్చేసి (20 కిలోల బియ్యానికి రూ.20 మిగులు) పీఎంజీకేఏవైకు పూర్తిగా ఎగనామం పెట్టేసిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ లెక్కన రెండు జిల్లాల్లో కోట్లాది రూపాయల లబ్ధికి పేదలు దూరమయ్యారు.

రూపాయి బియ్యం ఉచితమే.. : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్‌ బియ్యం(కిలో రూ.1) జనవరి నెల నుంచి ఉచితంగానే ఇస్తోంది. దీనివల్ల పీఎంజీకేఏవై ఉచిత బియ్యాన్ని ఇక ఇవ్వడం లేదు. రెండో కోటాపై ఎటువంటి ఆదేశాలూ లేవు.

మధుసూదనరావు, కేవీఎల్‌ఎన్‌ మూర్తి, విజయనగరం/పార్వతీపురం మన్యం జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు