logo

మద్దతు ధర పెంచి చింత తీర్చండి...!

సీతంపేట మన్యంలో చింతపండు సీజన్‌ ప్రారంభమైంది. పంటను సేకరిస్తున్న గిరిజనులు వారపు సంతలు, మార్కెట్లకు తెచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యత, పెద్ద సైజు బొడస ఉంటే మంచి ధర పలుకుతోంది.

Published : 06 Feb 2023 04:29 IST

సీతంపేట వారపు సంతలో అమ్మకానికి తెచ్చిన చింతపండు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మన్యంలో చింతపండు సీజన్‌ ప్రారంభమైంది. పంటను సేకరిస్తున్న గిరిజనులు వారపు సంతలు, మార్కెట్లకు తెచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యత, పెద్ద సైజు బొడస ఉంటే మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది పంట కూడా ఆశాజనకంగా ఉండటంతో గిరిజన రైతుల మోముల్లో సంతోషం కన్పిస్తోంది.

సీతంపేట ఐటీడీఏ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 130 ఎకరాల్లోని చెట్ల ద్వారా 468 టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. చెట్లు విడివిడిగా ఉంటాయి కనుక స్పష్టమైన లెక్కలు దొరకవని, ఇంతకంటే ఎక్కువ విసీర్ణంలోనే ఉండొచ్చని అంటున్నారు. తిత్లీ తుపాను తర్వాత చెట్లు బలహీనపడడం, చాలా కాలం కిందట నాటినవి కావడంతో ముదిరిపోవడం వంటి వాటి వల్ల కొన్నిసార్లు దిగుబడులు తగ్గుతున్నాయి. కొత్తగా నాటే పరిస్థితి లేకపోవడంతో ఒడిశాపైనా ఆధారపడాల్సి వస్తోందని వినియోగదారులు, వ్యాపారులు అంటున్నారు.

కాస్త సంతృప్తికరంగానే..: పెద్ద సైజు పండు అయితే ఒక రకంగా, చిన్నవైతే మరో రకంగా ధర పలుకుతుంది. కిలో రూ.45 నుంచి రూ.70, రూ.80 వరకూ అమ్ముడుపోతుంది. పంట ఎక్కువగా వస్తే ధర తగ్గే వీలుందని గిరిజనులు అంటున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్‌లో మంచి రేటు పలుకుతున్నప్పటికీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) మాత్రం ప్రస్తుతం గతేడాది ప్రకటించినట్లు కిలో రూ.32.40 ధరనే అమలు చేస్తోంది. ఈ ఏడాది మద్దతు ధర ఇంత వరకు ప్రకటించలేదు. బయట మార్కెట్‌లో మంచి రేటు వస్తున్న నేపథ్యంలో మద్దతు ధరను పెంచాలని గిరిజనులు జీసీసీని కోరుతున్నారు.

కాపుతో చెట్లు కనిపిస్తున్నాయి..: ఈ ఏడాది చింత చెట్లు కాపుతో కనిపిస్తున్నాయి. 18 చెట్ల ద్వారా గతేడాది రూ.40 వేలు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే రూ.2 వేల సరకు విక్రయించాం. మిగతా పంట సేకరించి, తర్వాత అమ్ముతాం. వర్షాలు లేకపోవడంతో ఆశాజనకంగా ఉంది. జీసీసీ మద్దతు ధరను పెంచాలి.  

సవర మల్లేష్‌, జగతిపల్లిరామన్నగూడ, సీతంపేట మండలం.

గతేడాది ధరకే కొనుగోలు: మంచి చింతపండు వస్తే గతేడాది జీసీసీ ప్రకటించిన ధరకే ప్రస్తుతం కొనుగోలు చేస్తాం, గతేడాది కిలో రూ.32.40 పైసలుగా ప్రకటించారు. ఇప్పటికైతే అదే ధరకు కొనుగోలు చేస్తాం. ఈ ఏడాది ఇంకా ఎలాంటి సూచనలు రాలేదు. గిరిజనులకు నష్టం జరగకుండా జీసీసీ ద్వారా మద్దతు ధర దొరికేలా చూస్తాం.

దాసరి కృష్ణ, మేనేజర్‌, జీసీసీ, సీతంపేట బ్రాంచి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని