logo

నిలిచిన రేషన్‌!

ఎండీయూ వాహనాల ఆపరేటర్ల వర్క్‌డౌన్‌తో శనివారం రెండు జిల్లాల్లో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ నిలిచిపోయింది. బీమా పేరుతో ఆపరేటర్ల ఖాతాల నుంచి ఒక్కో ఎండీయూకి రూ.18,890 మొత్తాన్ని బ్యాంకులు మినహాయించడాన్ని నిరసిస్తూ వారంతా వర్క్‌డౌన్‌కు  పిలుపునిచ్చారు.

Updated : 02 Apr 2023 06:16 IST

ఎండీయూ వాహన ఆపరేటర్ల వర్క్‌డౌన్‌
రెండు జిల్లాల్లో తిరిగినవి 27 వాహనాలే

విజయనగరం తహసీల్దార్‌ బంగార్రాజుకు వినతిపత్రం ఇస్తున్న ఎండీయూ వాహనదారులు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఎండీయూ వాహనాల ఆపరేటర్ల వర్క్‌డౌన్‌తో శనివారం రెండు జిల్లాల్లో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ నిలిచిపోయింది. బీమా పేరుతో ఆపరేటర్ల ఖాతాల నుంచి ఒక్కో ఎండీయూకి రూ.18,890 మొత్తాన్ని బ్యాంకులు మినహాయించడాన్ని నిరసిస్తూ వారంతా వర్క్‌డౌన్‌కు  పిలుపునిచ్చారు. తమ సమస్యను పరిష్కరిస్తే కానీ రేషన్‌ పంపిణీ చేయమని పలు చోట్ల వాహనాలను నిలిపివేశారు. తహసీల్దారు కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలకు రేషన్‌ అందలేదు. మొత్తం 566 వాహనాలకు 27 తిరిగినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. వర్క్‌డౌన్‌ కొనసాగితే ప్రజలకు రేషన్‌ కష్టాలు తప్పవన్నది స్పష్టమవుతోంది.

* ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ఒకటి నుంచి 17వ తేదీ వరకు ఇంటింటికీ రేషన్‌ పంపిణీ జరుగుతోంది. వర్క్‌డౌన్‌తో సమీప జిల్లాల్లో వీఆర్వోలతో పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నా, ఇక్కడ ఇటువంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. స్థానికంగా నేతల ఆదేశాలతో కొన్ని చోట్ల అందించినట్లు తెలిసింది.


చెబుతున్నదిలా..

* గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తానని హామీ ఇచ్చింది. నిబంధనల్లో కూడా పొందుపర్చారు. ఇటీవల మంత్రిని కలిసినప్పుడు ప్రభుత్వమే కడుతుందని చెప్పినట్లు కొందరు నిర్వాహకులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

* బ్యాంకులు బీమా ప్రీమియం మొత్తాన్ని జీతాల ఖాతా నుంచి మినహాయిస్తోంది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడంతో విధులు బహిష్కరించారు.

* 2022లో బీమా నిమిత్తం మినహాయించిన రూ.11,000 మొత్తానికి ఎటువంటి పత్రం ఇవ్వలేదు. ఏటా బీమా మొత్తం పెంచుతున్నారు.

* వాహనమిత్ర పథకం ద్వారా బీమా కింద రూ.పదివేలు మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా అమలు కాలేదు. మొత్తం ప్రీమియం ప్రభుత్వమే  చెల్లించాలి.


ఎవరికీ చెప్పకుండానే..
రిజ్వాన్‌, ఎండీయూ సమాఖ్య యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు చెప్పకుండా ఖాతాల్లో డబ్బులు తీసేస్తే ఎలా బతకాలి? హమాలీలకు డబ్బులు ఎలా చెల్లించగలం? మేం చేస్తున్నది ప్రభుత్వం, అధికారులపై వ్యతిరేక చర్య కాదు. బ్యాంకుల తప్పుగా భావిస్తున్నాం. ఏటా ప్రీమియం పెంపుపై స్పష్టత ఇవ్వాలి.


ఉన్నత స్థాయిలో చర్చలు
- కె.మధుసూదనరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి

ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సమస్య ఆదివారం నాటికి సద్దుమణుగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం బీమా ప్రీమియాన్ని సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని