logo

మళ్లీ పెంచేశారు

ప్రభుత్వం భూముల విలువ పెంపునకు ఆమోదం తెలిపింది. దీనిని జూన్‌ ఒకటి నుంచి అమలు చేయనుంది. కొత్త ధరలను స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్ల శాఖ కంప్యూటర్లలో బుధవారమే నమోదు చేయాలని ఆదేశించింది.

Updated : 01 Jun 2023 05:14 IST

నేటి నుంచి భూముల విలువ పెంపు

ఈనాడు-విజయనగరం, పార్వతీపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం భూముల విలువ పెంపునకు ఆమోదం తెలిపింది. దీనిని జూన్‌ ఒకటి నుంచి అమలు చేయనుంది. కొత్త ధరలను స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్ల శాఖ కంప్యూటర్లలో బుధవారమే నమోదు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు జిల్లా అధికారుల ఆదేశాలతో ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సిబ్బంది ఏఏ సర్వే నంబర్లలో పెంచింది నమోదు చేశారు.

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని ప్రధాన, రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కనున్న భూముల విలువను 40 నుంచి 60 శాతం వరకు పెంచారు. 2013లో శాస్త్రీయంగా భూముల ధరల విలువపై రివిజన్‌ జరిగింది. తర్వాత మధ్యమధ్యలో పెంచుతూ వచ్చింది. గతంలో ప్రభుత్వ ప్రాజెక్టులకు, రహదారుల నిర్మాణానికి సేకరించిన భూముల పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు పెంచలేదు. ఈసారి వాటిపై కూడా దృష్టి సారించింది.

భోగాపురం పరిసరాల్లో..

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలోని భూములకు గిరాకీ ఉంటుందని భావించింది. పూసపాటిరేగ మండలంలో నాలుగు, డెంకాడలో అయిదు, భోగాపురం మండలంలో 10 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. విమానాశ్రయ నిర్మాణ ప్రాంతం చుట్టూ ఉన్న ఎ.రావివలస, సవరవిల్లి, రావాడ, రాజాపులోవ, పోలిపల్లి, గూడెపువలస, కంచేరు, కౌలువాడ పరిధిలో చ.గ రూ.4 వేల నుంచి రూ.5 వేలకు, ఇతర ప్రాంతాల్లో రూ.3 నుంచి రూ.4 వేలకు పెంచారు. పార్వతీపురం సబ్‌ రిజిస్ట్రారు పరిధిలో పట్టణంలో, పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లోని గ్రామాల్లో సవరించే ప్రతిపాదనలు రూపొందించారు. పట్టణంలోని బైపాస్‌ కాలనీ, సౌందర్య థియేటర్‌ ప్రాంతం, రౌతువీధి, ఎన్‌ఎన్‌ఎం లేఅవుట్‌, ప్రధాన రహదారికి తూర్పు వైపు, రామానంద్‌నగర్‌, కేఎంహెచ్‌ ప్రాంతం, గూడ్సు షెడ్‌ రోడ్డు ప్రాంతంలో ఇళ్ల స్థలాల విలువ 30 శాతం వరకు, చర్చి వీధిలో 50 శాతం పెంచేలా ప్రతిపాదించారు. వ్యాపార లావాదేవీలు నిత్యం జరుగుతున్న ప్రాంతాల్లోనే పెంపునకు ప్రతిపాదనలు రూపొందించినట్లు జిల్లా రిజిస్ట్రారు పూర్ణచంద్‌ చెప్పారు.

* కొత్తవలస మేజర్‌ పంచాయతీలో గొల్లపేట ఎస్సీ కాలనీ, రామకోవెల, కాపువీధి, ఎరుకులపేట, ప్రాంతాల్లో గజం రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది.

* చింతలపాలెం, అర్ధన్నపాలెం, బలిఘట్టం, రెల్లి, తుమ్మికాపల్లి, ఉత్తరాపల్లి, లక్కవరపుకోట సహా 19 ప్రాంతాల్లో కనిష్ఠంగా 33, గరిష్ఠంగా 50 శాతం పెంచారు.

* విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 10 నుంచి 15 శాతం, దుక్కవాని వీధి పరిధిలో రూ.5 నుంచి రూ.6 వేలు, శ్రీనివాస జూనియర్‌ కళాశాల రహదారి ప్రాంతంలో రూ.15 వేల నుంచి రూ.18 వేలు అయింది.

* విజయనగరం పశ్చిమ రిజిస్టర్‌ కార్యాలయం పరిధిలో 59 గ్రామాలకు గాను 18 గ్రామాల్లో 20 శాతం వరకు పెంచారు.

* చీపురుపల్లి పరిధిలో 74 గ్రామాలకు గానూ 21 గ్రామాల్లో 30 నుంచి 56 శాతం అయింది.

* నెల్లిమర్ల పరిధిలో 73 గ్రామాలకు గానూ 15 గ్రామాల్లో 30 నుంచి 60 శాతం భూముల ధరలు పెరిగాయి. నెల్లిమర్ల, కెరటాం, ఎస్‌.ఎస్‌.ఆర్‌.పేట ప్రాంతాల్లో చదరపు గజం రూ.1800 నుంచి రూ.3 వేలు, రూ.3200 నుంచి రూ.4500 వరకు అయింది. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తామని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ విజయలక్ష్మి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని