logo

కోట్లే.. కోట్లు

ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టి సారించింది. భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లే ప్రధాన ఆదాయ వనరు కావడంతో వాటి మార్కెట్‌ విలువ పెంచింది.

Updated : 03 Jun 2023 04:44 IST

మూడు జిల్లాల్లో భారీగా పెరిగిన భూముల విలువ
ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయలక్ష్యం రెట్టింపు

ఈనాడు, పార్వతీపురం మన్యం: ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టి సారించింది. భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లే ప్రధాన ఆదాయ వనరు కావడంతో వాటి మార్కెట్‌ విలువ పెంచింది. ఈ నెల ఒకటి నుంచి అమలు చేస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.825.39 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. విజయనగరం జోన్‌ పరిధిలో 13 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్న శ్రీకాకుళం జిల్లా లక్ష్యం రూ.281.47 కోట్లు.. 11 కార్యాలయాలు ఉన్న విజయనగరం జిల్లా లక్ష్యం రూ.460.64 కోట్లు.. నాలుగు కార్యాలయాలు ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా లక్ష్యం రూ.83.27 కోట్లుగా పేర్కొంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.490.38 కోట్లు కాగా.. ఈ సారి దాదాపు రెట్టింపుతో ఆ శాఖ యంత్రాంగానికి భారీ లక్ష్యం విధించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పది రోజుల క్రితం నుంచే ఆయా జిల్లాల్లో పెద్దఎత్తున కసరత్తు జరిగింది. సంబంధిత అధికారులు రూపొందించిన జాబితాను ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆమోదంతో సిద్ధం చేసిన తుది జాబితాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాల విభజన తర్వాత ఆ జిల్లా కేంద్రాల్లోనే భూముల విలువ పెంచింది. ఇప్పుడు తాజాగా స్పెషల్‌ రివిజన్‌ పేరిట మరికొన్ని ప్రాంతాల్లో పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రాతిపదిక ఏదైనా.. పెంపు ప్రధానం

ఈసారి స్పెషల్‌ రివిజన్‌ పేరిట నాలుగు అంశాల ప్రాతపదికన భూముల విలువ పెంచింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భోగాపురం మండలం అనువైనదని గుర్తించిన తర్వాత తొమ్మిదేళ్లుగా ఆ భూముల జోలికిపోలేదు. ఎందుకంటే భవిష్యత్తులో అక్కడ రైతుల నుంచి భూసేకరణ జరిపితే మార్కెట్‌ ధర కంటే మూడు రెట్లు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ పూర్తవ్వడం.. శంకుస్థాపన సైతం జరగడంతో ఆ పరిసర ప్రాంతాల భూములపై కన్నేసింది. విమానాశ్రయం భూముల్లోకి అయిదు గ్రామాలు వెళ్లిపోవడంతో, మిగిలిన నాలుగు గ్రామాల్లో దాదాపు వంద శాతం వరకు భూముల విలువ పెంచేసింది.

రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తయిన అన్ని ప్రాంతాల్లోని భూములను గుర్తించారు. దీంతో కేవలం రహదారులను ఆనుకుని ఉన్న భూముల ధరలనే పెంచారు.  విజయనగరం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో 35 శాతం నుంచి 40 శాతం వరకు పెంచారు. గజం రూ.2,500 ఉన్న చోట రూ.3 వేలు, మరో చోట రూ.3,500 ఇలా ఆ ప్రాంతంలో నాలుగేళ్లలో జరిగిన భూక్రయ, విక్రయ లావాదేవీలను పరిగణనలోకి తీసుకున్నారు.

భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు గజం రూ.1,800 ఉండగా.. రూ.4 వేలకు, భోగాపురం మండలంలో జాతీయ రహదారికి ఇరువైపులా గజం రూ.2,800 నుంచి రూ.4 వేలు, భోగాపురం మండల కేంద్రంలో రూ.3,200 నుంచి రూ.5 వేలు చేశారు.

కొంత మంది భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి.. ఎక్కువ రుణం కోసం వాటి విలువ అమాంతం పెంచారు. బ్యాంకులు ఆ మేరకు రుణాలు ఇచ్చాయి. ఇప్పుడు ఆ సర్వే నంబర్ల ఆధారంగా విలువ పెంచడంతో ఇప్పుడు ఆ భూముల పరిసర ప్రాంత యజమానులు, కొనుగోలుదారులపై భారం పడింది.


కొన్ని ప్రాంతాల్లో పెంపు

- పి.విజయలక్ష్మి, స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, విజయనగరం జోన్‌

అధికారికంగా అన్ని పత్రాలు పరిశీలించి, వాస్తవ విలువలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ అధ్యయనంతో మాదిరి లెక్కలేసి కొన్ని ప్రాంతాల్లోనే భూముల విలువ ప్రభుత్వం పెంచింది. విజయనగరం జిల్లాలో 2,216 సర్వే నంబర్లలో కొంత విస్తీర్ణంలోనే పెరిగాయి. కొన్నేళ్ల నుంచి పెరగని భూములనూ ఎంపిక చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని