logo

చిన్ననాటి స్నేహితుడే కడతేర్చాడు

సంక్రాంతి పండగ సందర్భంగా బంగారు గొలుసు వేసుకోవడం అతనికి శాపమైంది. దాని కోసం ఆశపడిన చిన్ననాటి స్నేహితుడే కనికరం లేకుండా అతడిని హత్య చేసి గొలుసు తస్కరించాడు. ఈతముక్కల-సూరారెడ్డిపాలెం

Published : 24 Jan 2022 05:19 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సందర్భంగా బంగారు గొలుసు వేసుకోవడం అతనికి శాపమైంది. దాని కోసం ఆశపడిన చిన్ననాటి స్నేహితుడే కనికరం లేకుండా అతడిని హత్య చేసి గొలుసు తస్కరించాడు. ఈతముక్కల-సూరారెడ్డిపాలెం మార్గంలో పేరంటాళ్లమ్మ కుంట సమీపంలో ఈ నెల 14వ తేదీన జరిగిన హత్య కేసును కొత్తపట్నం పోలీసులు చేధించారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు తన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొత్తపట్నం మండలం కె.పల్లెపాలేనికి చెందిన కొక్కిలగడ్డ పిచ్చయ్య(38) ఈ నెల 14న ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు ఈ నెల 17న అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే అదే గ్రామానికి చెందిన మృతుడి స్నేహితుడైన ఐలా కోటిలింగంపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో హత్య విషయం బయటపడింది. ఈ నెల 14న బంగారు గొలుసు వేసుకొని బయటకు వచ్చిన పిచ్చయ్యను చూసిన కోటిలింగం దాన్ని తస్కరించాలని వ్యూహం పన్నాడు. వెంటనే తెలుసున్న వారి ఆటో తీసుకొచ్చి ఈతముక్కలలో పని ఉందని పిచ్చయ్యను అందులో తీసుకెళ్లాడు. అనంతరం బకింగ్‌హామ్‌ కెనాల్‌ సమీపంలో పేరంటాళ్లకుంట వద్ద ఇద్దరూ మద్యం తాగారు. పథకం ప్రకారమే మత్తులో ఉన్న అతడిపై దాడిచేసి లుంగీతో ఊపిరాడకుండా చేసి చంపాడు. నిందితుడిని అరెస్టు చేసి, గొలుసు రికవరీ చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఒంగోలు రెండో పట్టణ సీఐ ఎన్‌.రాఘవరావు, కొత్తపట్నం ఎస్సై ఫిరోజా ఫాతిమాలను ఎస్పీ మలికా గార్గ్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని