logo

ఎంపీ అయితే మాకేంటి..!

ఒంగోలులోని అగ్రహారం, సూరారెడ్డిపాలెం, టంగుటూరు, పాకల రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన కీలక సమావేశం అది. ఎంపీ పిలిస్తే పరుగెత్తుకుంటూ తాము హాజరుకావాలా అన్నట్లుగా ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించారు

Updated : 25 Jun 2022 11:57 IST

రైల్వే పనులపై సమావేశానికి మున్సిపల్‌ అధికారుల డుమ్మా

చెత్త సేకరణ పర్యవేక్షకుడిని పంపి మమ


అధికారులతో సమీక్షలో మాట్లాడుతున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: ఒంగోలులోని అగ్రహారం, సూరారెడ్డిపాలెం, టంగుటూరు, పాకల రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన కీలక సమావేశం అది. ఎంపీ పిలిస్తే పరుగెత్తుకుంటూ తాము హాజరుకావాలా అన్నట్లుగా ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించారు. పదే పదే పిలిచినమీదట చివరకు ఓ ఒప్పంద ఉద్యోగిని పంపించి మమ అన్పించారు. శుక్రవారం ఇది చోటుచేసుకుంది. రైల్వే, ఆర్‌అండ్‌బి, మున్సిపల్‌ శాఖల అధికారులతో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు రామ్‌నగర్‌లోని తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేశారు. మూడురోజుల క్రితమే సంబంధిత శాఖలకు సమాచారమిచ్చారు. విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల రైల్వే అధికారులతో పాటు అర్‌ అండ్‌ బి అధికారులు హాజరైనా ఒంగోలు కార్పొరేషన్‌ నుంచి ఎవరూ రాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పలుమార్లు ఫోన్‌చేస్తే అదిగో ఇదిగో అంటూ బదులిచ్చారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో తమ అధికారులంతా పాల్గొన్నారని తెలిపారు. ‘‘ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నిస్తుంటే, మీరిలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అండర్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగి సమస్య పరిష్కారం కావడం మీకు అస్సలు ఇష్టం లేనట్లుంది’ అంటూ కార్పొరేషన్‌ అధికారుల తీరుపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యవహరించడం ఇది మూడోసారని వ్యాఖ్యానించారు. ,మూడేళ్ల క్రితం సహాయ కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేసి, ప్రస్తుతం ఒప్పంద ప్రాతిపదికన చెత్త సేకరణను పర్యవేక్షిస్తున్న డి.బ్రహ్మయ్యను ఎంపీ కార్యాలయానికి అధికారులు పంపారు. వారి తీరుపై ఎంపీ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. పార్లమెంటరీ కమిటీకి ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది. కాగా ఆయా ప్రాంతాల్లో అండర్‌ బ్రిడ్జిలు, వంతెనలు లేకపోవడం వల్ల ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని.. వాటి నిర్మాణాలను సత్వరం ప్రారంభించి పూర్తి చేయాలని రైల్వే అధికారులకు ఎంపీ సూచించారు. ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈ విజయరత్నం, ఈఈ నాయక్‌, డీఈ షేక్‌ మహబూబ్‌, గిద్దలూరు రైల్వే ఏడీఈ జగదీష్‌, ఏఈఈ రజేంద్రప్రసాద్‌, నాగభూషణం(విజయవాడ), కార్పొరేటర్‌ చింతపల్లి గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘాల వినతి...

పొగాకు పండుగుల్ల అమ్మకం వేలం కేంద్రాల ద్వారానే జరిగేలా చర్యలు తీసుకోవాలని, బయట మార్కెట్‌లో గుల్ల విక్రయాలను నేరంగా పరిగణించాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఎంపీ మాగుంటకు శుక్రవారం వినతి అందజేశారు. బయట విక్రయాలు చెల్లవని పొగాకు బోర్డు చట్టం చేయాలని..పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని