logo

మా తుఝే సలాం..

దేశ సరిహద్దు వద్ద మంచుగడ్డల్లో, వణికించే చలిలో విధులు నిర్వహించే సైనికుల వల్లే మన దేశం సురక్షితంగా ఉంది. అలాంటి చోట పనిచేసే సైనికుల్లో మన జిల్లావాసులు ఉండటం గర్వకారణమైతే, అందులో పశ్చిమ ప్రాంత వాసులే ఎక్కువమంది ఉండటం గమనార్హం.  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పశ్చిమం లోని యువత ఉపాధి

Updated : 13 Aug 2022 05:35 IST

దేశ రక్షణలో పశ్చిమం గ్రామాలు

ఆరు యుద్ధాల్లో జిల్లా సైనికులు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే :

దేశ సరిహద్దు వద్ద మంచుగడ్డల్లో, వణికించే చలిలో విధులు నిర్వహించే సైనికుల వల్లే మన దేశం సురక్షితంగా ఉంది. అలాంటి చోట పనిచేసే సైనికుల్లో మన జిల్లావాసులు ఉండటం గర్వకారణమైతే, అందులో పశ్చిమ ప్రాంత వాసులే ఎక్కువమంది ఉండటం గమనార్హం.  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పశ్చిమం లోని యువత ఉపాధి కోసం దేశ రక్షణ వైపు మొగ్గు చూపారు. అలా ప్రారంభమైన వెల్లువ నేటికీ కొనసాగుతూ వస్తోంది. జిల్లాకు చెందిన వారు త్రివిధ దళాలకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశ సేవకు అంకితమై తమ దేశభక్తిని చాటుతున్నారు.

జిల్లాకు చెందిన సైనికులు దేశ సరిహద్దులో పహారా కాస్తూ త్రీవవాదుల దాడుల్లో అమర వీరులైన సైనికులు ఉన్నారు. 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్థాన్‌, 1971 పాకిస్థాన్‌, 1987 నుంచి 1989  ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌ శ్రీలంక యుద్ధంలో, 1999లో 83 రోజుల పాటు జరిగిన కార్గిల్‌ యుద్ధంలో మన జిల్లాకు చెందిన సైనికులు పాల్గొని పలువురు అమర వీరులు అయ్యారు. దేశ సరిహద్దు ప్రాంతంలో నిత్యం జరిగే యుద్ధంలో ఎంతో మంది సైనికులు ప్రాణాలను సైతం తెగించి దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు.

విధి నిర్వహణలో అమరుడైన సైనికుడు రామృకృష్ణారెడ్డి మృతదేహం వద్ద గౌరవవందనం చేస్తున్న

అప్పటి కలెక్టర్‌ వినయ్‌చంద్‌, ఆర్మీ అధికారులు(పాత చిత్రం)

* గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన నాయక్‌ సుబేదార్‌ కంకర వెంకట సుబ్బారెడ్డి 2015 అక్టోబరు 26వ తేదీన జమ్ము కాశ్మీర్‌లో శత్రువుల దాడిలో మృతిచెందాడు. అతని మరణానంతరం కేంద్రప్రభుత్వం శార్యచక్ర మెడల్‌ను రాష్ట్రపతి చేతులమీదుగా ఆయన సతీమణి సావిత్రికి అందజేశారు. బురుజుపల్లె గ్రామానికి చెందిన కూరాకు బాలయ్య అనే సైనికుడు జమ్ము ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ కార్గిల్‌ యుద్ధం సమయంలో బాంబుదాడిలో మృతిచెందాడు. కృష్ణంశెట్టిపల్లె గ్రామానికి చెందిన సంగిరెడ్డి సంజీవరెడ్డి కాశ్మీర్‌ ప్రాంతంలో విధి నిర్వహణలో మంచు కొండలు విరిగిపడి మృతిచెందడంతో అతని ప్రభుత్వం సేనా మెడల్‌ ప్రకటించింది. ఓబులాపురం గ్రామానికి చెందిన యువ సైనికుడు తల్లపురెడ్డి రామకృష్ణారెడ్డి 2017 అక్టోబరు నెలలో జమ్ముకాశ్మీర్‌ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న సమయంలో పాక్‌ సైన్యం దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.

*  రాచర్ల మండలం గౌతవరం గ్రామానికి చెందిన సైనికుడు రజాక్‌ కార్గిల్‌ యుద్ధంలో మృతిచెందాడు.

*  ఒంగోలుకు చెందిన నాయక్‌ సుబేధార్‌ ఎస్‌కె.అక్బర్‌ విధి నిర్వహణలో మృతిచెందడంతో సేనా మెడల్‌ వారి కుటుంబసభ్యులకు అందజేశారు.

వీరమరణం పొందిన వెంకటసుబ్బారెడ్డి, శౌర్యచక్ర మెడల్‌ను రాష్ట్రపతి చేతులమీదుగా

అందుకుంటున్న ఆయన సతీమణి సావిత్రి (పాత చిత్రం)

నమోదైన మాజీలు  13,664 మంది

జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకున్న లెక్కల ప్రకారం 13,664 మంది మాజీ సైనికులు ఉన్నారు. ఆర్మీలో పనిచేసిన వారు 13,035, నేవీ లో పనిచేసిన వారు 221, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన వారు 408 మంది ఉన్నారు. జిల్లా మొత్తం మీద 33 మంది యుద్ధ వితంతువులు, 13 మంది సైన్యంలో చేరి విధి నిర్వహణలో వికలాంగులైన వారు 13 మంది, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వార్‌ వెటరన్స్‌ వితంతువులు 42 మంది ఉన్నారు.

ప్రతి కుటుంబంలో సైనికోద్యోగులు

జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు సైనికోద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉన్నారు. దేశ భద్రత కోసం పదో తరగతి పూర్తయిన వెంటనే సైన్యంలో చేరుతున్నారు. అర్థవీడు మండలంలోని అర్థవీడు, వీరభద్రాపురం, నాగులవరం గ్రామాల్లో, రాచర్ల మండలంలోని రాచర్ల, అనుమలవీడు, చోళవీడు, రామాపురం గ్రామాల్లో, గిద్దలూరు మండలంలోని కృష్ణంశెట్టిపల్లె, ముండ్లపాడు గ్రామాల్లో, కంభం మండలం తురిమెళ్లలో, కొమరోలు మండలం మల్లారెడ్డిపల్లె గ్రామాల్లో ఎక్కువ మంది సైన్యంలో సేవలు అందిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనే సమారు 18 వేలకు పైగా మాజీ సైనికులు ఉండగా, విధి నిర్వహణలో సుమారు 5వేల మందికి పైగా సైనికులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని