logo

అంతా రెప్పపాటులోనే..

సరిగ్గా మరో పది నిమిషాల్లో తన మినీ వ్యాన్‌లో తీసుకువస్తున్న సామగ్రితో గమ్యస్థానం చేరాల్సిన ఆ చోదకుడు అంతలోనే ప్రమాదానికి గురయ్యాడు.

Published : 29 Nov 2022 02:17 IST

జాతీయ రహదారిపై ఢీకొన్న మినీ వ్యాన్‌, ఆర్టీసీ బస్సు
చోదకుడి మృతి.. మరో 15 మందికి స్వల్పగాయాలు

త్రిపురాంతకం మండలం ముడివేములలోని ఘటనా స్థలం

త్రిపురాంతకం, న్యూస్‌టుడే: సరిగ్గా మరో పది నిమిషాల్లో తన మినీ వ్యాన్‌లో తీసుకువస్తున్న సామగ్రితో గమ్యస్థానం చేరాల్సిన ఆ చోదకుడు అంతలోనే ప్రమాదానికి గురయ్యాడు. ఆ వాహనం, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా బస్సు చోదకుడితో పాటు 15 మంది గాయపడ్డారు. త్రిపురాంతకం మండలం ముడివేముల వద్ద 544డి జాతీయరహదారిపై సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని వెంకటప్పయ్య కాలనీకి చెందిన రూపావత్‌ వెంకటేశ్వర నాయక్‌ (35) వృత్తిరీత్యా డ్రైవర్‌. వివిధ ప్రాంతాలకు మినీ వ్యాన్‌లో(ఏపీ39 టీఏ 0520) సరకులు సరఫరా చేస్తుంటారు. సోమవారం క్రిమి సంహారక మందులు తీసుకుని గుంటూరు నుంచి త్రిపురాంతకం బయలుదేరారు. ముడివేముల వద్ద మార్కాపురం నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 07 జెడ్‌ 0507), ఈ వాహనం ఢీకొన్నాయి. వెంకటేశ్వర నాయక్‌ వాహనంలోనే ఇరుక్కుని మృతి చెందారు. గుంటూరు డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌ తిరుపతిరావుకు తీవ్ర గాయాలు కాగా కండక్టర్‌ శ్రీనివాసరావుతో సహా మరో 15 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. త్రిపురాంతకం స్టేషన్‌ సీఐ రాంబాబు, ఎస్సై వెంకట సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వెంకటేశ్వర నాయక్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ జాతీయ రహదారి నాలుగు లేన్లు కాకపోవడంతో మధ్యలో ఎటువంటి విభాగినులు లేవు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి విస్తరణ ప్రతిపాదనలు ఉన్నా ఇంకా అమలుకు నోచుకోలేదు.

వెంకటేశ్వర నాయక్‌ (పాత చిత్రం)


కుటుంబానికి ఆధారమేదీ

వెంకటేశ్వర నాయక్‌కు భార్య సుబ్బమ్మతో పాటు కుమారుడు, కుమార్తె, తల్లి ఉన్నారు. వాహనం నడిపితే తప్ప కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. ఇంటికి పెద్ద దిక్కయిన అతని మృతితో ఇక తమకు దిక్కెవరంటూ రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని