logo

నిండా ముంచేశారు!

‘‘ఒకటికి పదిరెట్లిస్తాం.. స్థలాలు కొనిస్తాం.. మొక్కలు పెంచి ఇస్తాం... మీకు తెలిసిన వారిని చేర్పిస్తే కమిషన్‌ ఇస్తాం..’’ అంటూ ప్రకటనలతో ఆశలు రేకెత్తించి వందలాదిమందిని మోసగించింది ‘సంకల్ప సిద్ధిమార్ట్‌’ సంస్థ.

Published : 01 Dec 2022 03:06 IST

ఆవేదనలో ‘సంకల్ప సిద్ధిమార్ట్‌’ బాధితులు

కొనుగోలు చేసినట్లు చూపుతున్న స్థలంలో ఎర్రచందనం మొక్కలు

కనిగిరి, న్యూస్‌టుడే: ‘‘ఒకటికి పదిరెట్లిస్తాం.. స్థలాలు కొనిస్తాం.. మొక్కలు పెంచి ఇస్తాం... మీకు తెలిసిన వారిని చేర్పిస్తే కమిషన్‌ ఇస్తాం..’’ అంటూ ప్రకటనలతో ఆశలు రేకెత్తించి వందలాదిమందిని మోసగించింది ‘సంకల్ప సిద్ధిమార్ట్‌’ సంస్థ. దీని బాధితులు ఒకరొకరుగా ముందుకొచ్చి తమ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ మోసాలు అక్కడ తీగ లాగితే కనిగిరిలో బయటపడిన విషయం తెలిసిందే. నిర్వాహకులు యాప్‌ ద్వారా గొలుసుకట్టు వ్యాపారం చేపట్టారు. ఇందులో చేరినవారు కట్టిన నగదుకు భరోసాగా కనిగిరి ప్రాంతంలో 150 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మొక్కలు నాటి 15 ఏళ్ల తర్వాత విక్రయించేలా.. వచ్చిన ఆదాయంలో చెరిసగం అన్నట్లుగా ఒప్పంద పత్రాలు రాయించారు. తమ మోసపు వ్యాపారానికి అనుకూలంగా కనిగిరి, పామూరు, పీసీపల్లి, పామూరు, సీఎస్‌పురం తదితర ప్రాంతాల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. రూ.10 వేలు కడితే రోజుకు రూ.100.. రూ.50 వేలు కడితే రూ.500, రూ.3 లక్షలు చెల్లిస్తే రూ.3 వేలు.. అలా 100 రోజుల్లో అసలు మొత్తం వచ్చేస్తుందంటూ ప్రకటనలిచ్చారు. మొదట కట్టినవారికి రోజూ నగదు జమ అవుతుండటంతో ఆశతో వ్యాపారులు, రైతులు, కూలీలు, ఆటోచోదకులు సుమారు 300 మందికిపై ఈ ప్రాంతాల్లో చెల్లించారు. రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు కట్టిన వారు ఉన్నారు. నిర్వాహకులు బోర్డు తిప్పేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. పైగా కనిగిరి ప్రాంతంలో కొందరు నాయకులు ఈ మోసంలో సూత్రధారులుగా ఉన్నారని బాధితులు తెలిపారు. కట్టిన డబ్బుకు ఢోకా లేదని.. పైగా మార్ట్‌ యాజమాన్యం రోజూ కమిషన్‌ ఇస్తుందని.. మీ పేరిట స్థలం, మొక్కలతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తారని చెప్పి నమ్మించారని వాపోయారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని బుధవారం కనిగిరిలో బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు.

కనిగిరిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంకల్ప సిద్ధిమార్ట్‌ బాధితులు

* కనిగిరికి చెందిన దాసరి మల్లికార్జున స్థానికంగా శుభకార్యాలకు సామగ్రి సరఫరా చేసే దుకాణం నిర్వహిస్తున్నారు. రూ.10 పెట్టుబడి పెడితే వంద వస్తుందని కొందరు ఆశ కల్పించడంతో రూ.56 వేలను ‘సంకల్ప సిద్ధి మార్ట్‌’కు కట్టారు. రోజుకు రూ.560 జమ అవుతూ వచ్చాయి. కొద్ది రోజుల తర్వాత యాప్‌ అదృశ్యమైంది. తన డబ్బుల సంగతేమిటో అర్థం కావడంలేదని ఆయన ఆవేదన చెందారు.

* కొత్తపేటకు చెందిన రైతు సైకం శివారెడ్డిని తెలిసినవారు సంకల్ప యాప్‌లో చేరమని చెబితే చేరారు. రూ.3 లక్షల వరకు డిపాజిట్‌ చేశారు. రెండు మూడు నెలలు కమిషన్‌ వచ్చింది. యాప్‌లో ఆయన చెల్లించిన నగదునూ చూపించారు. ఆ తర్వాత బోర్డు తిప్పేయడంతో శివారెడ్డి లబోదిబోమంటున్నారు.

* కనిగిరి పాతూరు ప్రాంతానికి చెందిన యువకుడు యు.నవీన్‌కుమార్‌.. మిత్రుడి సూచనతో రూ.10 వేలు ‘సంకల్ప సిద్ధిమార్ట్‌’కు కట్టాడు. కుటుంబ సభ్యులనూ చేర్పించాడు. ఇప్పుడు తామంతా మోసపోయామని మదన పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని