logo

పురంలో అధికార గొలుసు దుకాణం

మార్కాపురం పట్టణ కేంద్రంలో అధికార గొలుసు దుకాణం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల వరకు ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహించిన ప్రాంతంలో అది ఉండటం గమనార్హం.

Published : 01 Dec 2022 03:06 IST

యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
చోద్యం చూస్తున్న సెబ్‌ అధికారులు

కంభం రహదారిలోని గొలుసు దుకాణంలో మద్యం విక్రయిస్తున్న దృశ్యం

మార్కాపురం నేర విభాగం న్యూస్‌టుడే: మార్కాపురం పట్టణ కేంద్రంలో అధికార గొలుసు దుకాణం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల వరకు ప్రభుత్వ మద్యం దుకాణం నిర్వహించిన ప్రాంతంలో అది ఉండటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్‌ అధికారులకు స్థానిక బార్ల యజమానుల నుంచి ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  పట్టణంలో మొత్తం నాలుగు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వాటిలో గడియార స్తంభం కూడలిలోని దుకాణానికి ఎదురుగా ఓ ప్రధాన ప్రార్థనా మందిరం ఉండటంతో అధికారులు దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని నిర్ణయించారు. దీంతో పాటు కంభం రహదారిలోని మరో దుకాణానికి సంబంధించిన భవనం లీజు గడువు పూర్తయింది. మళ్లీ పునరుద్ధరించేందుకు వీలు లేకుండా యజమానితో కూతవేటు దూరంలో ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంటు యజమాని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఇక్కడి దుకాణాన్ని పూల సుబ్బయ్య కాలనీకి, గడియార స్తంభం కూడలిలో ఉన్న దుకాణాన్ని డ్రైవర్స్‌ కాలనీకి మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీన రెండు దుకాణాల్లోని మొత్తం సరకును నూతన భవనాల్లోకి తరలించారు. అయితే కంభం రహదారిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం స్థానంలో మాత్రం వ్యాపారం నిర్వహిస్తూనే ఉన్నారు. అదీ బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో విక్రయించే ధరలకు అదనంగా రూ.50-100 తీసుకొని యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నారు. కంభం రహదారిలో ఉన్న రెస్టారెంట్‌కు ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గరగా ఉండటంతో పథకం ప్రకారం ఖాళీ చేయించిన యజమాని అది ఖాళీ అయిన వెంటనే ఆగమేఘాలపై కొంత సరకును అక్కడికి తరలించి అనధికారిక గొలుసు దుకాణం నిర్వహిస్తుండటం కొసమెరుపు.  కళ్లముందు ప్రధాన రహదారిపై లక్షల రూపాయల వ్యాపారం అనధికారికంగా సాగుతున్న నియంత్రించాల్సిన సెబ్‌ అధికారులు చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మరో వైపు పట్టణంలో కొత్త ప్రాంతాలకు తరలించక ముందు రోజుకు ఒక్కో దుకాణంలో రూ.3 లక్షల నుంచి 4 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరగా నూతన దుకాణాల్లో కనీసం లక్షకు మించక పోవడం శోచనీయం. అయితే ఈ రెండు దుకాణాలు తరలి పోవడంతో రెస్టారెంట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణంలో మొత్తం అయిదు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉండగా అవన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు చెందినవి కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని