logo

పేరు మార్చి.. పైసా ఇవ్వలేదు

‘జిల్లాకు మంజూరైన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు, తరగతులు ప్రారంభమవుతాయి...’ ఇవీ నాటి విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన.

Published : 28 Jan 2023 02:47 IST

ఈ ఏడాదీ విశ్వమిథ్యాలయమే        
ఆచరణకు నోచని పాలకుల మాటలు

నగరంలోని నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ సెంటర్‌

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ‘జిల్లాకు మంజూరైన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు, తరగతులు ప్రారంభమవుతాయి...’ ఇవీ నాటి విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన. అధికారులు కూడా పీజీ ప్రవేశాలను కొత్త విశ్వవిద్యాలయం పేరుతోనే చేపట్టనున్నట్టు తెలిపారు. ఆచరణలో ఇవేమీ అమలు కాలేదు. టంగుటూరు ప్రకాశం విశ్వవిద్యాలయం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరును ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంగా మార్చారు. ఇన్‌ఛార్జి ఉప కులపతిగా ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ను నియమించారు. ఓఎస్డీ బాధ్యతలను పీజీ కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్‌ ఆచార్యునికి అప్పగించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించిన ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకం, డిగ్రీ కళాశాలల విభజన, ఎన్‌యూ నుంచి ఆస్తుల పంపకం చేపట్టాల్సి ఉంది. ఈ పనుల్లో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు పూర్తికాలేదు.

నాగార్జున పేరుతోనే నిర్వహణ...: రాష్ట్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయం భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తారని అంతా ఆశించారు. చివరికి నిరాశే మిగిలింది. బడ్జెటేతర పద్దు కింద నిర్వహణ అవసరాలకు నిధులు కేటాయిస్తామని, ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు కోరారు. ఈ మేరకు రూ.10 కోట్లు అవసరమని జిల్లా నుంచి నివేదిక పంపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో నిధులు వస్తాయని ఎదురు చూసినప్పటికీ పైసా విడుదల కాలేదు. సిబ్బంది నియామకం, న్యాక్‌ గుర్తింపు వంటివేమీ లేకపోవడంతో ఈ ఏడాది కూడా నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారానే బోధన, సిబ్బందికి వేతనాలు, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

పాత కోర్సులతోనే ప్రవేశాలు సరి...: జిల్లాలో ఏర్పాటయ్యే విశ్వవిద్యాలయంలో కొత్తగా 8 కోర్సులు ప్రారంభించాలని తొలుత ప్రతిపాదించారు. చివరికి ఎన్‌యూ పీజీ కేంద్రంలో ఉన్న 11 పాత కోర్సుల్లోనే ఈ ఏడాదికి ప్రవేశాలు చేపట్టారు. ఆంధ్రకేసరి పేరుతో ప్రవేశాలు చేపట్టినప్పటికీ ఎన్‌యూ ఆధీనంలోనే కోర్సుల నిర్వహణ సాగుతోంది. విశ్వవిద్యాలయం వస్తుందా రాదా అనే డోలాయమాన పరిస్థితిలో విద్యార్థులు ఇక్కడ చేరడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా 11 కోర్సుల్లో కలిపి అయిదు వందలకు పైగా సీట్లు ఉండగా కేవలం 111 మంది మాత్రమే చేరారు. ఎంబీఏలో 60 సీట్లుండగా 45 మంది ప్రవేశాలు పొందారు. ఎంపీఈడీలో వంద సీట్లకు గాను 22 మంది.. పీజీ చరిత్ర విభాగంలో అసలు ప్రవేశాలు లేవు. మిగిలిన వాటిలోనూ చేరిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించొచ్చు. ఇప్పటికైనా పాలకులు స్పందించి కొత్త విశ్వవిద్యాలయం ప్రారంభానికి అవసరమైన నిధుల కేటాయింపునకు కృషిచేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని