logo

అప్పులు తీర్చాలని అంత్యక్రియల అడ్డగింత

చేసిన అప్పులు తిరిగి చెల్లించే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దంటూ అడ్డుకున్న ఉదంతం గిద్దలూరు మండలం పొదలకుంటపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది.

Updated : 28 Jan 2023 05:29 IST

శనగల వ్యాపారి ఇంటి వద్ద గుమికూడిన బాధితులు, గ్రామస్థులు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: చేసిన అప్పులు తిరిగి చెల్లించే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దంటూ అడ్డుకున్న ఉదంతం గిద్దలూరు మండలం పొదలకుంటపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. శనగలకు గిట్టుబాటు ధర లభించక.. మరోవైపు రైతుల నుంచి కొనుగోలు చేసిన సరకుకు చేసిన అప్పులు తీర్చే దారి లేక పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన శనగల వ్యాపారి కొప్పరపు శ్రీనివాసులు(48) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేంచేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అప్పులిచ్చిన రైతులు, బాధితులు మృతదేహాన్ని శ్మశానానికి తరలించకుండా రెండు గంటల పాటు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ మహిళా పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. కొమరోలు, గిద్దలూరు ఎస్సైలు సుబ్బరాజు, బ్రహ్మనాయుడు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అప్పులిచ్చిన రైతులు, బాధితులతో మాట్లాడారు. అంత్యక్రియలకు అడ్డుపడొద్దని, కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవాలని సూచించి బాధితులను అక్కడి నుంచి పంపారు. అనంతరం శ్రీనివాసులు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని