logo

బరితెగించిన అధికారం

దర్శి నగర పంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. స్థిరాస్తి రంగం ఊపందుకోవడం, అడుగు జాగా కూడా మంచి ధర పలుకుతుండటంతో కబ్జా చేసేందుకు వెనుకాడటం లేదు. 

Published : 03 Feb 2023 02:05 IST

దర్శిలో ప్రభుత్వ భూముల స్వాహాకు యత్నాలు
న్యూస్‌టుడే, దర్శి

దర్శి-అద్దంకి రోడ్డులోని 340/5 సర్వే నంబరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పునాదుల కోసం తవ్విన గుంత

దర్శి నగర పంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. స్థిరాస్తి రంగం ఊపందుకోవడం, అడుగు జాగా కూడా మంచి ధర పలుకుతుండటంతో కబ్జా చేసేందుకు వెనుకాడటం లేదు.  

దర్శి-అద్దంకి ప్రధాన రహదారి పక్కనే 340/5 సర్వే నంబరులో 93 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ సెంటు స్థలం విలువ రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల పైమాటే. గతంలో కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు కట్టేందుకు బోరు తీసి పునాదులు వేశారు. ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో కొంతభాగాన్ని పీడీసీసీ భవన నిర్మాణానికి కేటాయించారు. మరికొంత భాగాన్ని పై భూములకు వెళ్లడానికి దారి కోసం వదిలారు. ఇప్పుడు దానిని ఆక్రమించడానికి ప్రయత్నాలు జరిగాయి. తాజాగా మట్టి డంప్‌ చేయడంతో పాటు పునాదులు తవ్వారు. విషయం తెలిసి అధికారులు వాటిని తొలగించి బోర్డు ఏర్పాటు చేశారు. టీచర్స్‌ కాలనీ సమీపంలోని సర్వే నం 789లో 25 నుంచి 30 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఇదే కాలనీలో సర్వేనంబరు 779 లో 35 సెంట్ల ప్రభుత్వ భూమి ఉండగా తాజాగా ఆక్రమణకు నేతలు రంగం సిద్ధంచేశారు. ఇక్కడ సెంటు స్థలం విలువ రూ.8 లక్షల వరకు ఉంది. అలాగే పొదిలి రోడ్డులోని కాటేరు వాగు స్థలం, కురిచేడు రోడ్డులో డొంక పోరంబోకు స్థలాల్లో కబ్జాలు జోరందుకున్నాయి.

టీచర్స్‌ కాలనీ సర్వే నంబరు 779 లో ప్రభుత్వ భూమిని చదును చేసిన దృశ్యం

వివాదాలు ముదిరి

ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు ఒకరికొకరు పోటీ పడటంతో వివాదాలు ముదురుతున్నాయి. అద్దంకి రోడ్డు, టీచర్స్‌ కాలనీ స్థలాల విషయంలో అక్రమార్కులు రెవెన్యూ అధికారుల ముందు పంచాయతీలు పెడుతున్నారు. కురిచేడు రోడ్డులో డొంక పోరంబోకు దాదాపు 8 ఎకరాలు ఉంది. కొంతభాగం రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇదే స్థలంలో కొంత గతంలోనే ఓ విద్యాలయం వారు ఆక్రమించుకున్నారని, అనంతరం వెంచర్‌లు వేసి పలువురు అమ్మకాలు కూడా జరిపారని రైతులు ఆరోపిస్తున్నారు. వారిని వదిలి తమను ఎందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న స్థలాలను కొందరు ఆక్రమించి దుకాణాలు, భవనాలు ఏర్పాటుచేశారు. సాయినగర్‌లో ఈ తంతు ఎక్కువగా ఉంది.


చర్యలు తీసుకుంటాం
- శ్రావణకుమార్‌, తహసీల్దార్‌, దర్శి.

ప్రభుత్వ భూములు ఆక్రమణ నేరం.. వాటి జోలికి ఎవరు వెళ్లినా శిక్షార్హులే. కబ్జాల విషయం తెలిసిన వెంటనే ఆ స్థలాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమార్కులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని