logo

అశ్రువులే మిగిలిన ఊళ్లు

సాగు చేద్దామంటే నీళ్లు లేవు.. భూములున్నవారు సైతం నిరుపయోగంగా వదిలేయాల్సిన దుస్థితి.. చేసేందుకు పనులూ కరవు.  దీంతో రెక్కలను నమ్ముకొని, వృద్ధులను ఇళ్ల వద్ద విడిచి అనేకమంది పొరుగు రాష్ట్రాల బాట పట్టారు.

Updated : 03 Feb 2023 05:55 IST

పనులు లేక వలస వెళ్తున్న గ్రామస్థులు
పీసీపల్లిలోని వివిధ పంచాయతీల్లో పరిస్థితి
ఈనాడు డిజిటల్‌, ఒంగోలు; న్యూస్‌టుడే, పీసీపల్లి

కుటుంబాలు ఖాళీ అయిన అన్నపురెడ్డిపల్లె గ్రామం

సాగు చేద్దామంటే నీళ్లు లేవు.. భూములున్నవారు సైతం నిరుపయోగంగా వదిలేయాల్సిన దుస్థితి.. చేసేందుకు పనులూ కరవు.  దీంతో రెక్కలను నమ్ముకొని, వృద్ధులను ఇళ్ల వద్ద విడిచి అనేకమంది పొరుగు రాష్ట్రాల బాట పట్టారు. గతంలో మనుషులు, పశుపక్ష్యాదులతో కళకళలాడిన గ్రామాలు ఇప్పుడు కళ తప్పి కనిపిస్తున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లు పండగల సమయంలో మాత్రమే తెరుచుకుంటున్నాయి. పీసీపల్లి మండలంలోని వివిధ పంచాయతీల్లో నెలకొన్న పరిస్థితి ఇది.

కనిగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో 20, 30శాతం కుటుంబాలు వలస బాట పట్టాయి. పీసీపల్లి మండలంలోని పెదఇర్లపాడు పంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలు ఉండగా జనాభా 5 వేలమంది. అన్నపురెడ్డిపల్లి, కోడూరువారిపల్లి, కొత్తపల్లి గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. 140 కుటుంబాల్లో 70 కు పైగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరిలో అసలు భూములు లేనివారు.. ఎకరా, అర ఎకరా, అయిదెకరాలు సొంతంగా ఉన్నవారు సైతం ఉన్నారు. అన్నపురెడ్డిపల్లి చుట్టుపక్కల విశాలమైన భూములు ఉన్నాయి. కనిగిరి, కందుకూరు, పామూరుకు రహదారి సదుపాయాలు ఉన్నాయి. రైతులు బోర్లు వేసినా గంగమ్మ ఉబకలేదు. సాగునీటికి ఆధారం లేక ఏంచేయాలో పాలుపోని దుస్థితి.

ఏ వీధిచూసినా

అన్నపురెడ్డిపల్లిలోని ఏ వీధిలోకి వెళ్లినా వరుసగా నాలుగైదు ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తాయి. అయినవారిని వదిలి తెలంగాణ, బెంగళూరు, తమిళనాడు వెళ్లిపోయారు. ఆ ప్రాంతాల్లో బేల్దారీ, సెంట్రింగ్‌, ఇతర పనులు చేస్తున్నారు. పండగలు, ఇతర శుభ కార్యాలకు సొంతూళ్లకు వస్తుంటారు. అంబవరపు నాగేశ్వరరావుకు ఊరిలో సొంత ఇల్లు,. పొలం ఉంది. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి తెలంగాణ వెళ్లారు. అక్కడ బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.‌ చల్లా నారాయణ భార్య, పిల్లలతో బేల్దారీ పనులకు బెంగళూరు వెళ్లారు. గ్రామంలోని ఇంటిలో తల్లి మంగమ్మ బిక్కుబిక్కుమంటూ  ఎదురుచూస్తున్నారు.

* ఆలూరి కృష్ణారెడ్డికి భార్య సరోనమ్మ, అయిదుగు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలయ్యాయి. కృష్ణారెడ్డి తెలంగాణలో బేల్దారీ పనులకు వెళ్లగా, భార్య గ్రామంలోని ఓ కుమార్తె వద్ద ఉంటున్నారు. ‌ బత్తుల రమణయ్య, చల్లా శ్రీను, మాలకొండయ్య ఇలా అనేకమంది గ్రామాన్ని విడిచారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడం కోసం వలస వెళ్తున్నారని.. పిల్లలనూ చదివించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. కష్టపడితే రోజుకు రూ.600 నుంచి రూ.1000 వరకు వస్తుందని, సంవత్సరానికి రెండు, మూడుసార్లు మాత్రమే పల్లెకు వస్తుంటారన్నారు.

కుమారుడు, కోడలు బెంగళూరు వెళ్లడంతో ఇంటి వద్ద ఒంటరిగా వృద్దురాలు మంగమ్మ


బోర్లు వేసినా  నీళ్లులేవు
-ఆదిరెడ్డి, అన్నపురెడ్డిపల్లి

గ్రామంలో 20 ఎకరాలు పొలం ఉంది. ఇప్పటికి 40 దఫాలు బోర్లు వేసి విఫలమయ్యాను. మెట్ట భూముల్లో సాగుచేసినా అతివృష్టి, అనావృష్టితో నష్టాలు తప్పడంలేదు. మూడేళ్లుగా పంటలు వేసి ఏటా రూ.4లక్షల వరకు నష్టపోయాను. మా పిల్లలు కూడా ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. పల్లెలో సగంమంది వలస పోయారు. మరికొందరు జిల్లాలోనే ఇతర ప్రాంతాల్లో పనిచేసుకుంటున్నారు. దీంతో గ్రామం ఖాళీ అయింది.


ఇక్కడ ఆధారం  లేకనే వలస
-మహేంద్ర, పెదఇర్లపాడు

ఉన్న ఊళ్లో భూములున్నా వ్యవసాయానికి నీళ్లు లేవు. చదువుకున్నవారికి ఉపాధి లేదు. స్థానికంగా బతుకుదెరువు లేక యువకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. వెలిగొండ జలాలను తీసుకొస్తే సాగుకు ఇబ్బంది ఉండదు. నిమ్జ్‌ పరిధిలో పారిశ్రామికవాడను అభివృద్ధి చేసి పరిశ్రమలు స్థాపించాలి. అప్పుడే కనిగిరి నియోజకవర్గంలో వలసలను అరికట్టవచ్చు.


అనాథల్లా  బతుకుతున్నాం
-సావిత్రి, నిర్మల్‌కు వలస వెళ్లిన మహిళ

గ్రామంలో కొద్దిగా పొలం ఉన్నా నీళ్లు లేవు. ఇద్దరు పిల్లలతో తెలంగాణలోని నిర్మల్‌కు వెళ్లాం. సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ అనాథల్లా బతుకుతున్నాం. కుమారుడి నిశ్చితార్థానికి గ్రామానికి వచ్చాం. కార్యం అయ్యాక అంతా తిరిగి వెళ్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని