logo

వేతనం ఎప్పుడొచ్చేను!

ఒంగోలుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సొంతిల్లు నిర్మాణ నిమిత్తం బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ రూ.40 వేల చొప్పున చెల్లించాలి.

Published : 09 Feb 2023 03:23 IST

వివిధ శాఖల ఉద్యోగుల ఎదురుచూపులు

ఒంగోలుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సొంతిల్లు నిర్మాణ నిమిత్తం బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ రూ.40 వేల చొప్పున చెల్లించాలి. ముందస్తుగా ఆయన చెక్కు ఇచ్చారు. గడువులోపు చెల్లించకుంటే అదనంగా రూ.500 జరిమానాతోపాటు, క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుంది. గతేడాదిగా జీతాల సమస్య నెలకొనడంతో స్నేహితుల వద్ద సర్దుబాటు నిమిత్తం తీసుకుని ఖాతాలో నిల్వ ఉంచుతున్నారు. ప్రతి నెలా ఇదో సమస్యగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఉద్యోగులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి నెలా ఒకటో తేదీన వేతనం వస్తుందన్న పరిస్థితి మారిపోయింది. ఈ నెల 8వ తేదీ గడిచినా పలు కీలకశాఖలకు చెందిన ఉద్యోగులకు జమకాలేదు. జిల్లాలో 72 శాఖలకు చెందిన సుమారు 40 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అందులో గరిష్ఠంగా ఏడు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ తర్వాత రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీసు, వైద్య, వ్యవసాయ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఎక్కువమంది కనిపిస్తారు. వీరందరికీ ప్రతి నెల వేతనాల చెల్లింపు నిమిత్తం సుమారు రూ.200 కోట్ల నిధులు అవసరం. గతేడాదిగా ఉద్యోగులకు జీతాల చెల్లింపులో రోజుల తరబడి జాప్యం జరుగుతూనే ఉంది. ప్రాధాన్యతా క్రమంలో తొలుత ఖజానాశాఖతో పాటు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు, రెవెన్యూ శాఖకు క్రమం తప్పకుండా వేతనాలు జమవుతున్నాయి. ఇప్పటికీ వేతనాలు అందని ఉద్యోగుల్లో ఉపాధ్యాయ, పశు సంవర్ధకశాఖ, పరిశ్రమలు, సెరికల్చర్‌, ఇంజినీరింగ్‌, జలవనరులు, జిల్లా యువజన సంక్షేమ, జిల్లా పౌరసరఫరాలు, భూ సేకరణ విభాగం తదితర శాఖలవారు ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వారికి ఒకటో తేదీనే పెన్షన్లు జమ కావడం కాస్త ఊరట.  

రుణం లభించక

బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, పిల్లలకు విద్యా రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈంఎఐల చెల్లింపులకు అయిదో తేదీ గడువు పెట్టుకుంటారు. పదో తేదీ దాటే వరకు జీతం రాకపోవడంతో వడ్డీ భారం పడుతుందని వాపోతున్నారు. మరోవైపు ఇంటి అద్దె, పాలు, నిత్యావసరాలు, ఔషధాలు, విద్యుత్తు బిల్లు తదితర ఖర్చులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. రుణాలు దొరకడమూ కష్టమైంది.

ఒకటో తేదీనే  చెల్లించాలి

నెలంతా పనిచేస్తాం. ఒకటో తేదీనే వేతనం తీసుకోవడం ఉద్యోగి హక్కు. పదో తేదీ వరకు సగం శాఖలకు చెందిన ఉద్యోగులకు ఇవ్వకపోతే ఇంటి నిర్వహణ ఎలా? పైగా బ్యాంకులో తీసుకున్న గృహ, వ్యక్తిగత రుణాలకు నెలవారీ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. వాటిపైనా ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు అడ్డంకిగా మారుతుంది.

రోజ్‌కుమార్‌, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు