logo

కన్నీటి గాథ.. వెంటాడే వ్యధ

పొదిలి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం గ్రామమది.. కొన్నేళ్లుగా వేధిస్తున్న ఫ్లోరైడ్‌ భూతంతో అనేకమంది తల్లడిల్లుతున్నారు.

Updated : 26 Mar 2023 03:49 IST

పీడిస్తున్న ఫ్లోరోసిస్‌ భూతం
రాజుపాలెంలో బాధితుల ఆవేదన

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు, న్యూస్‌టుడే, పొదిలి : పొదిలి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం గ్రామమది.. కొన్నేళ్లుగా వేధిస్తున్న ఫ్లోరైడ్‌ భూతంతో అనేకమంది తల్లడిల్లుతున్నారు. అనారోగ్యం, నడిచేందుకు సైతం ఓపిక లేక, కాయకష్టం చేసుకునే సత్తువ లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. భూగర్భంలో ఉన్న ఫ్లోరైడ్‌తో కూడిన నీళ్లు తాగకుండా ప్రభుత్వం శుద్ధజలం పంపిణీ తలపెట్టినా నిర్వహణ కరవై, ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ‘న్యూస్‌టుడే’ ఈ పల్లెను పరిశీలించింది.

రాజుపాలెం గ్రామం

రాజుపాలెం గ్రామంలో 250 కుటుంబాలు ఉండగా వెయ్యిమంది జనాభా కనిపిస్తారు. ఇక్కడి నీటిలో ఫ్లోరైడ్‌ 7పీపీఎం ఉందని ఏళ్ల క్రితమే గుర్తించారు. అప్పటి గవర్నర్‌ కుముద్‌బెన్‌జోషి గ్రామంలో పర్యటించి ఫ్లోరైడ్‌ తీవ్రతను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించారు. చేతి పంపులు, బావుల్లోని నీళ్లు తాగకూడదని సూచించారు. అందరికీ శుద్ధజలం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణమే దర్శి నుంచి సాగర్‌ జలాలను అందించే ఏర్పాటు చేశారు. గ్రామ ప్రవేశమార్గం వరకు నీళ్లు వచ్చినా ఇంటింటికీ మాత్రం అవి చేరలేదు. నాలుగైదు రోజులకు ఒకసారి, ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వచ్చినప్పుడు ఎగువన ఉన్న గృహస్థులు అక్కడికి వచ్చి నీళ్లు పట్టుకెళ్లాలంటే యుద్ధమే చేయాలి. కొన్నేళ్లుగా సకాలంలో నీళ్లు రావడం లేదు. తాగునీటి కుళాయి కనెక్షన్లు లేవు. చేతిపంపులు, బావుల్లో నీరు వాడుకలకు వినియోగిస్తున్నారు. పశువులకూ వాటినే తాగిస్తున్నారు. ఏళ్ల క్రితం అవగాహన లేక ఈ నీళ్లు వాడినవారి దంతాలు రంగుమారి గారతో కనిపిస్తున్నాయి. ఎముకలు, కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారు. సరిగా నడవలేక, మంచాలకే పరిమితమైనవారు ఉన్నారు.  

నిత్యం రక్షిత జలాలను అందిస్తేనే..

ప్రస్తుతం గ్రామంలో 40 నుంచి 50 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కీర్తి వెంకటస్వామి మాట్లాడుతూ కాళ్లు చచ్చుబడి ఇంటికే పరిమితమయ్యానని తెలిపారు. పనులకు వెళ్లలేక, కుటుంబాన్ని పోషించుకోలేక నైరాశ్యంతో ఉన్నామన్నారు. డబ్బయ్యేళ్ల కీర్తి అయ్యన్న మాట్లాడుతూ ఫ్లోరైడ్‌ సమస్య ఉందని తెలియక ఈ నీళ్లు తాగామని.. వాటి పర్యవసానాలతో అవస్థలు పడుతున్నామన్నారు. కర్ర సాయంతో నాలుగడుగులు వేయడం తప్ప ఎక్కడికీ వెళ్లలేనన్నారు. గ్రామంలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఎక్కించాలని, పైపులైన్లు విస్తరించి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటుచేసి సాగర్‌ జలాలను అందించాలని స్థానికులు కోరుతున్నారు.


అక్కాచెల్లెళ్ల దైన్యం

రాజుపాలెం గ్రామానికి చెందిన చల్లా పెద్దయోగమ్మ (70), చల్లా చిన్న యోగమ్మ (65) అక్కాచెల్లెళ్లు. వీరిలో పెద్దయోగమ్మకు నలుగురు పిల్లలు పుట్టి వివిధ కారణాలతో చనిపోయారు. చెల్లెలకు కుమార్తె ఉన్నారు. ఫ్లోరైడ్‌ భూతం వీరిని వెంటాడింది. మంచాలకే పరిమితమయ్యారు. అటూ ఇటూ కదలాలన్నా...నీళ్లు, భోజనం కావాలన్నా ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే. ఒకప్పుడు బాగా బతికిన తాము తెలియక ఫ్లోరైడ్‌ నీళ్లు తాగి ఇలా మంచాన పడ్డామని, తమలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని వారు కన్నీటి పర్యంతమయ్యారు.


మందులు పనిచేయవు

ఈ చిత్రంలో ఉన్న గద్యా రత్తమ్మ(80) కాళ్లు, చేతులు చచ్చుబడి పూర్తిగా నడవలేరు. నాడు తనకు అవగాహన లేక ఫ్లోరైడ్‌ నీళ్లు తాగానని.. ఇంటిలోుంచి బయటకు, లోనికి పాకుతూ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందారు. గత 40ఏళ్లుగా ఇలానే నొప్పులతో అవస్థలు పడుతున్నానని.. సూది మందులు, మందుబిళ్లలు పనిచేయడంలేదని వాపోయారు. .


అవస్థలు పడుతున్నాం

అరవై అయిదేళ్ల చల్లా వెంకటేశ్వర్లు కాళ్లు వంకరపోయి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. గ్రామంలో నీళ్లు మంచివికావని, గరళమని ఆయన వాపోయారు. పశువులు కూడా అవే నీళ్లు తాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామానికి నాలుగైదు రోజులకోసారి మంచి నీళ్లు వచ్చినా ఎగువ ప్రాంతానికి అందడంలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని