logo

కొత్త దారిలో చెత్త పన్ను

పురజనుల నుంచి చెత్త పన్ను(యూజర్‌ ఛార్జీలు) వసూలుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసింది.

Updated : 27 Mar 2023 06:55 IST

‘ఆస్తి’లో కలిపి నోటీసులకు ప్రతిపాదనలు
నిర్బంధ వసూలు దిశగా యంత్రాంగం చర్యలు

ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పురజనుల నుంచి చెత్త పన్ను(యూజర్‌ ఛార్జీలు) వసూలుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసింది. గృహాలు, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఆస్తుల తీరును బట్టి చెత్త పన్ను విధించారు. మురికివాడల్లో నివాసం ఉంటున్న వారు నెలకు రూ.50, ఇతర కాలనీల్లో ఇళ్లకు నెలకు రూ.100, వాణిజ్య పరమైన వాటికి కనిష్ఠంగా రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. చెత్త పైనా పన్ను విధించి వసూలు చేయడాన్ని ప్రజలు వ్యతిరేకించారు. క్షేత్రస్థాయిలో చాలా మంది చెల్లింపునకు ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు కొత్త దారిని ఎంచుకుంది. ఆస్తి పన్నుతో కలిపి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ సర్వర్‌లో మార్పులు చేయడానికి చురుగ్గా కసరత్తు సాగుతోంది. సాధారణంగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఇంటి పన్నుల వసూలును ఏప్రిల్‌ నుంచి ప్రారంభిస్తారు. మార్చి ఆఖరు నాటికి డిమాండ్‌ నోటీసులు సిద్ధం చేస్తారు. ఈసారి ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. చెత్త పన్నును కూడా కలిపి నోటీసులు తయారు చేయాలనే నిర్ణయమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

* ఆచరణలో అమలు కాని ఆలోచన...: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం అమలులో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ కోసం నాలుగు చక్రాల ఆటోలను ప్రవేశపెట్టారు. ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా వీటి నిర్వహణ చేపట్టారు. ఇందుకుగాను నెలకు ఒక్కో వాహనానికి రూ.63 వేలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒంగోలులో మాత్రమే ఇవి నడుస్తుండటంతో కార్పొరేషన్‌ నుంచి నెలకు సుమారు రూ.40 లక్షలు సంబంధిత ఏజెన్సీకి చెల్లించాల్సి ఉంది. చెత్త పన్ను వసూలు ద్వారా వచ్చే రుసుంతోనే వాహనాలు   నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఆచరణలో ఇది అమలు కావడం లేదు. సచివాలయ సిబ్బందికి పన్ను వసూలు బాధ్యత అప్పగించారు. బలవంతంగా కాకుండా అవగాహన కల్పించి వసూలు చేయాలని సూచించారు. అయినప్పటికీ నగరంలో 60 నుంచి 70 శాతం మంది మాత్రమే చెల్లిస్తున్నారు. కొరవ నిధులను నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి ఏజెన్సీకి చెల్లించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి అన్ని స్థానిక సంస్థల్లోనూ కొనసాగుతోంది.

యజమానులు- అద్దెదారులు...

యూజర్‌ ఛార్జీలను పూర్తిస్థాయిలో వసూలు చేయడానికి ఇకపై ఆస్తిపన్నుతో కలిపి డిమాండ్‌ నోటీసు ఇవ్వాలని ప్రతిపాదించారు. వాస్తవానికి ఇంటి పన్నులోనే మున్సిపల్‌ సేవలకు సంబంధించిన పన్ను కూడా కలసి ఉంటుంది. చెత్త సేకరణ యూజర్‌ ఛార్జీలు అనేది కొత్తగా ప్రవేశపెట్టిన విధానం. ఒకసారి పన్ను డిమాండ్‌లో కలిపితే భవిష్యత్తులో తొలగించడం కూడా కష్టమవుతుంది. దీంతోపాటు ఇంటి యజమాని, అద్దెలకు ఉండేవారి మధ్య వివాదాలకు కారణమవుతుందని ప్రజాసంఘాలు, సిటిజన్‌ ఫోరం ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్ను యజమాని పేరుతో వస్తుంది. ఇప్పటివరకు అద్దెలకు ఉండేవారు యూజర్‌ ఛార్జీలు చెల్లిస్తున్నారు. కొత్త విధానంలో ఇంటి యజమాని ఆస్తి పన్నుతో కలపి ఏడాది మొత్తానికి ఒకేసారి చెత్త పన్ను చెల్లించాలి. ఆ డబ్బులను అద్దెకు ఉండేవారి వద్ద వసూలు చేసుకునే విషయంలో యజమానికి ఇబ్బందులు తప్పవు. ఒకేసారి చెల్లింపు పేద, మధ్యతరగతి వర్గాలకు భారమవుతుంది.

ప్రభుత్వ బకాయిలు రూ. 14.10 కోట్లు...

ఆస్తి, చెత్త పన్నులను ప్రభుత్వ కార్యాలయాలు కూడా చెల్లించాలి. ఒంగోలు నగరంలో ఆస్తి పన్ను కూడా సక్రమంగా వసూలు కావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావల్సిన పన్ను బకాయిలు రూ.14.10 కోట్లుండగా.. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.53 లక్షలు వసూలైంది. బడ్జెట్‌ రావడం లేదని 80 శాతం కార్యాలయాలు పన్నులు చెల్లించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని