logo

గుదిబండలా.. దేవాదాయ భూములు

దశాబ్దాల క్రితమే శాశ్వత నివాసాలు నిర్మించుకున్న వారి భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో అక్కడివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Published : 27 Mar 2023 04:09 IST

అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన రిజిస్ట్రేషన్లు
ఈసారైనా ముఖ్యమంత్రి పట్టించుకునేనా ?

పాత సింగరాయకొండ నరసింహస్వామి ఆలయం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దశాబ్దాల క్రితమే శాశ్వత నివాసాలు నిర్మించుకున్న వారి భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో అక్కడివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం .. పాలకుల నిర్వాకంతో స్థానికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. సింగరాయకొండ పరిసరాల్లోని దేవాదాయ భూముల పరిధిలోని వారికి ఇదో ఎడతెగని సమస్యగా మిగిలింది.

2013లో పాత సింగరాయకొండ నరసింహ స్వామి ఆలయ భూములు గుర్తించే క్రమంలో ఇచ్చిన జీవోలో గ్రామాలకు గ్రామాలు దేవాదాయ శాఖ భూముల పరిధిలోకి వస్తాయని తెలపడంతో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ చూపాలని స్థానికులంటున్నారు. ప్రధానంగా పాతసింగరాయకొండ, సింగరాయకొండ, సోమరాజుపల్లి, కలికవాయ గ్రామాల్లోని 1,500 ఎకరాలు దేవాదాయ శాఖ భూముల జాబితాలో ఉన్నాయి. దీంతో వాటి క్రయ విక్రయాలపై నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. 2013లో అప్పటి ప్రభుత్వం మండలంలోని కొన్ని భూములను నిషేధిత భూములుగా పేర్కొంటూ జీవో జారీ చేసింది. అప్పటికే దశాబ్దాల క్రితం నివాసాలు నిర్మించుకుని జీవిస్తున్నామని, ఇప్పుడీ షరతులు విధించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

గతంలో సీఎంకు విన్నవించినా..

వాస్తవానికి మండలంలో 2,500 ఎకరాలకు ఆంక్షలుండగా, రెండేళ్ల క్రితం వ్యవసాయ, పారిశ్రామికవాడకు చెందిన భూములంటూ 1,000 ఎకరాలకు మినహాయింపునిచ్చారు. అలాగే నివాసాలు ఏర్పరచుకున్న భూములకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. గతేడాది ఒంగోలు సభకు విచ్చేసిన ముఖ్యమంత్రికి స్థానిక నాయకులు కలిసి భూములపై నిషేధాజ్ఞలు తొలగించాలని వినతి పత్రాలు అందజేశారు. వాటి క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. గతేడాది శాసనసభ సమావేశాల్లో ప్రస్తుత నెల్లూరు జిల్లా కందుకూరు శాసనసభ్యుడు మహీధర్‌రెడ్డి ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించినా పరిష్కారం కాలేదు.

చిల్లిగవ్వ వచ్చే వీలులేక..

ఎన్నో ఏళ్లుగా రూ. లక్షల విలువైన భూములను అమ్ముకునేందుకు వీలుకాక వేలాది కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఇటు పిల్లలకు నాణ్యమైన విద్య అందించలేక, ఇంట్లో కనీస అవసరాలు తీర్చలేక మథన పడుతున్నారు.  కనీసం ఆ భూములు తనఖా పెట్టి నాలుగు డబ్బులు తీసుకుందామన్నా వీలు కావడం లేదని వారంటున్నారు. ఇళ్లు, స్థలాలపై నిషేధాజ్ఞలు ఉండటంతో బ్యాంకర్లు కూడా రుణాలివ్వడానికి ముందుకు రావడం లేదు. వడ్డీ వ్యాపారులు సైతం అప్పులు ఇవ్వకపోవడంతో అత్యవసర వైద్యసేవలు పొందేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పిల్లల వివాహాలు చేయడం కూడా తమకు కష్టసాధ్యంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. గతంలో పనిచేసిన దేవాదాయ శాఖ అధికారులు చేసిన  తప్పిదాల వల్ల తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి  తమ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని