logo

తిరుమలలో గౌరవం ఇవ్వడం లేదు

రుమలలో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని అనుచరులతో కలిసి దర్శించుకున్నారు.

Published : 27 Mar 2023 04:09 IST

గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని అనుచరులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కనీసం ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా లేకుండా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనను దించి తనిఖీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాతో పాటు నా సతీమణి సీఎం కార్యాలయంలోని ధనుంజయరెడ్డి నుంచి సిఫార్సు లేఖ తీసుకొస్తే తనకు ప్రొటోకాల్‌ దర్శనం ఇచ్చి, భార్యకు జనరల్‌ బ్రేక్‌ దర్శనం ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కనీసం సీఎం కార్యాలయానికి కూడా విలువ లేదా అంటూ ప్రశ్నించారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సామాన్య భక్తులను బూచిగా చూపుతూ తితిదే ఈవో ధర్మారెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, తనకు కావాల్సిన వారికి అన్ని రకాల దర్శనాలు కల్పిస్తూ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. తనతో పాటు ప్రొటోకాల్‌ దర్శనానికి 200 మంది వచ్చారని, వారందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులా అంటూ ప్రశ్నించారు. తితిదే ఈవో లాంటి కొందరు చేసే పనులకు సీఎంపై ఎమ్మెల్యేలకు అసంతృప్తి కలుగుతోందన్నారు.

రెండు రోజుల పాటు ఎమ్మెల్యేతో పాటు 28 మందికి దర్శనం

ఆరోపణలపై తితిదే ఉన్నతాధికారులు స్పందించి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ఎమ్మెల్యే తన అనుచరులు 28 మందితో రెండు రోజుల క్రితం తిరుమలకు వచ్చారన్నారు. తితిదే అదనపు ఈవో కార్యాలయం నుంచి ఎమ్మెల్యేతో పాటు 10 మందికి ప్రొటోకాల్‌ దర్శనం, మిగిలిన వారికి సాధారణ బ్రేక్‌ దర్శనాన్ని కల్పించామన్నారు. రెండో రోజు అదే రీతిలో కల్పించామని స్పష్టం చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్‌ పరిధిలోని వారు స్వయంగా హాజరైన ఆరుగురికే దర్శనం ఇస్తామని, ఎమ్మెల్యే కావడంతో ఆయన వెంట పదిమందికి ప్రొటోకాల్‌, మిగిలిన వారికీ వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తితిదే అధికారులపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని