logo

వ్యర్థం అనే మాటే లేదిక

పొగాకు బోర్డులోనే రైతుల వద్ద ఉన్న పొగాకు సూర, ముక్కల అమ్మకాలు సాగించాలని బోర్డు నిర్ణయించింది.

Published : 30 Mar 2023 02:33 IST

అమ్మకాల కోసం పొదిలి వేలం కేంద్రానికి తెచ్చి ఉంచిన పొగాకు బేళ్లు

పొదిలి, న్యూస్‌టుడే: పొగాకు బోర్డులోనే రైతుల వద్ద ఉన్న పొగాకు సూర, ముక్కల అమ్మకాలు సాగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది నుంచే అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా వేలం కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో రైతుల వద్ద ఉన్న పొగాకు సూర, ముక్కలు(బిట్స్‌) బహిరంగ మార్కెట్‌లో చిన్న వ్యాపారులు కొనుగోలు చేసేవారు. వీటిని బోర్డు అధికారులు అంతగా పట్టించుకునేవారు కాదు. ఈ ఏడాది నుంచి వీటిని కూడా బోర్డు ద్వారానే అమ్మకాలు సాగించి.. రైతుల ఖాతాలకు నగదు జమ చేయడం ద్వారా వ్యాపారుల దోపిడీని అరికట్టవచ్చనేది బోర్డు ఉద్దేశం. పొదిలి వేలం కేంద్రంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి సూర, ముక్కలు అమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రైతులకు బోర్డు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సూర వివరాలను వేలం కేంద్రం క్షేత్రాధికారుల వద్ద నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.

* ఇవీ నిబంధనలు...: బోర్డు ద్వారా సరఫరా చేసే పట్టాల్లోనే సూర, ముక్కలను బేలుగా కట్టి రైతులు తేవాల్సి ఉంటుంది. గోతాల్లో తెచ్చిన వాటిని అనుమతించరు. బేలు బరువు 150 కిలోలకు మించకూడదు. రైతులు తమ టీబీజీఆర్‌ సంఖ్య పైనే అమ్ముకుని నగదును ఖాతాల్లో వేయించుకునే అవకాశం ఉంది. పొగాకు బేళ్లు మాదిరిగానే వారం రోజుల్లో రైతుల ఖాతాలో నగదు జమ అవుతాయి. ఈ విషయమై పొదిలి వేలం కేంద్రం నిర్వహణాధికారి జి.గిరిరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పొగాకు బోర్డు రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రైతుకు పక్కాగా నగదు అందడంతో పాటు పదే పదే వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదని చెప్పారు. బోర్డు అధికారులకు తెలియకుండా బయట అమ్ముకుంటే విజిలెన్స్‌ అధికారులు పట్టుకుంటారని, అప్పుడు భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని