logo

ఇంటింటికీ పంపిణీ చేయలేం..

‘గత రెండు నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ) వాహనాలు నడపలేకున్నాం. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వాహనాలు నిలిపేసి నిరసన తెలుపుతాం...’ ఇదీ డీఎస్వో ఉదయభాస్కర్‌కు ఎండీయూ ఆపరేటర్లు ఇటీవల అందజేసిన నోటీసులోని సారాంశం.

Published : 01 Apr 2023 04:12 IST

అందని జీతాలు.. తేలని కమీషన్‌
ఆందోళనలో ఎండీయూ ఆపరేటర్లు
నేటి నుంచి నిరసనకు సమాయత్తం
కొత్తపట్నం, న్యూస్‌టుడే:

గిద్దలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో నిలిపి ఉంచిన ఎండీయూ వాహనాలు

‘గత రెండు నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ) వాహనాలు నడపలేకున్నాం. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వాహనాలు నిలిపేసి నిరసన తెలుపుతాం...’ ఇదీ డీఎస్వో ఉదయభాస్కర్‌కు ఎండీయూ ఆపరేటర్లు ఇటీవల అందజేసిన నోటీసులోని సారాంశం.

ప్రజా పంపిణీ దుకాణాలకు వెళ్లకుండానే సంచార వాహనాల ద్వారా నిత్యావసర సరకులను ఇంటికి చేరవేస్తున్నారు. ఇందుకు అవసరమైన వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల కింద రాయితీపై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ద్వారా వాయిదాల పద్ధతిపై అందించారు. వీటిని నడిపే ఆపరేటర్లకు నెలకు రూ.21 వేలు చొప్పున ప్రభుత్వం వేతనంగా అందిస్తోంది. అందులో కొంత నగదును బ్యాంక్‌ వాయిదాతో పాటు, ఇంధనం, సహాయకుల ఛార్జీలకు వెచ్చించాల్సి ఉంది. మిగతా సొమ్ముతో నిర్వాహకులు జీవనోపాధి పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ క్రమేపీ పరిస్థితులు మారుతున్నాయి. వాహనాలకు బ్యాంకులే బీమా ప్రీమియం చెల్లిస్తాయని తొలుత చెప్పారు.. తర్వాత ఆపరేటర్లే ఆ భారం భరించాలన్నారు. వీటికితోడు ప్రభుత్వం విడుదల చేస్తున్న వేతనాలు ఖాతాల్లో పడుతున్నప్పటికీ అవి ఆపరేటర్ల చేతికి సక్రమంగా అందడం లేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.  

385 వాహనాలు.. 6,59,576 కుటుంబాలు...: జిల్లాలో 385 ఎండీయూ వాహనాలున్నాయి. వీటి ద్వారా ఆపరేటర్‌తో పాటు, బియ్యం తూకం వేసే సహాయకుడు ఒకరు ఉపాధి పొందుతున్నారు. వీరు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 17వ తేదీలోపు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 6,59,576 కుటుంబాలకు ఇంటి వద్దకే బియ్యంతో పాటు, కందిపప్పు, పంచదార సరఫరా చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం రూ.21 వేలు జీతం ఇస్తుండగా.. అందులో రూ.3 వేలు వాహన రుణంగా బ్యాంక్‌ మినహాయించుకుంటుంది. రూ.18 వేలు ఆపరేటర్‌ చేతికి వస్తోంది. ఇంధనానికి, సహాయకుడికి కలిపి సుమారు రూ.8 వేల వరకు ఖర్చవుతున్నాయి.

అప్పు కింద జీతాల మినహాయింపు...: ఆపరేటర్ల ఖాతాల్లో గత రెండు నెలలుగా జీతాల సొమ్ము పడుతున్నప్పటికీ బ్యాంకులు అప్పు కింద పూర్తి మొత్తాన్ని మినహాయించుకుంటున్నాయి. సదరు ఖాతాలో వ్యక్తిగతంగా దాచుకున్న సొమ్మును తీసుకోవడానికి కూడా అడ్డుపడుతున్నాయి. ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యం, కందిపప్పును చేరవేసే బాధ్యతను ఎండీయూ ఆపరేటర్లకే అప్పగించారు. అందుకు కమీషన్‌ రూపంలో అదనపు భత్యం చెల్లిస్తామని ఉన్నతాధికారులు గతంలో హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా వాటికి సంబంధించి ఒక్క పైసా కూడా ఆపరేటర్లకు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గత రెండు నెలలుగా జీతాలు చేతికి అందక.. అప్పులు చేసి వాహనాలను నడపాల్సి రావడంతో అవస్థలు పడుతున్నారు.

సమస్యలు  పరిష్కరిస్తేనే నడిపేది...

ఏప్రిల్‌ నెలకు సంబంధించి కార్డుదారులకు సరఫరా నిమిత్తం జిల్లాకు కందిపప్పు 634.98 మెట్రిక్‌ టన్నులు; పంచదార 338.65 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. అందులో శుక్రవారం నాటికి కందిపప్పు 572 మెట్రిక్‌ టన్నులు, పంచదార 330 మెట్రిక్‌ టన్నుల మేర పౌరసరఫరాల గిడ్డంగులకు చేరింది. డీలర్లు వంద శాతం పంపిణీకి డీడీలు తీశారు. శనివారం నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే తమ సమస్యలు పరిష్కరించే వరకు వాహనాలను తిప్పబోమని ఆపరేటర్లు మండల తహసీల్దార్ల దృష్టికి తీసుకొచ్చారు. గిద్దలూరు మండలానికి చెందిన ఎండీయూ ఆపరేటర్లు ఇప్పటికే తమ వాహనాలను తహసీల్దార్‌ కార్యాలయానికి తెచ్చి పెట్టారు. దీంతో శనివారం నుంచి యథావిధిగా సరకుల పంపిణీ ఉంటుందా.. లేదా..? అనే విషయంపై అనిశ్చితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని