logo

గ్రానైట్‌కు బహిరంగ మోసం

‘పాదయాత్ర సమయంలో ఇటుగా ప్రయాణించాను. ఆ సమయంలో చిన్న గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్ల నుంచి సీనరేజ్‌ వసూలు కోసం స్లాబ్‌ విధానానికి హామీ ఇచ్చాను.

Published : 26 May 2023 02:14 IST

అమలవ్వని విద్యుత్తు రాయితీ విధానం
ఆదాయం కోసం ఇచ్చిన హామీకి మంగళం
కటింగ్‌ యూనిట్ల నిర్వహణకు గడ్డుకాలం

చీమకుర్తిలోని ఓ పరిశ్రమలో ఉన్న గ్రానైట్‌ స్లాబులు

‘పాదయాత్ర సమయంలో ఇటుగా ప్రయాణించాను. ఆ సమయంలో చిన్న గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్ల నుంచి సీనరేజ్‌ వసూలు కోసం స్లాబ్‌ విధానానికి హామీ ఇచ్చాను. ఇక నుంచి ఆ పద్ధతి అమలు చేస్తాం. ఆ ప్రకారం 22 క్యూబిక్‌ మీటర్ల ముడిరాయి కటింగ్‌ చేసుకునే ఒకే బ్లేడ్‌ యూనిట్ల నుంచి రూ.27 వేలు, అంతకుమించిన బ్లేడ్‌ యూనిట్ల నుంచి రూ.54 వేలు మాత్రమే వసూలు చేస్తాం. ఆ మేరకు జీవో నంబరు 58ని తీసుకొచ్చాం. అలానే పరిశ్రమలకు హెచ్‌టీ కనెక్షన్‌ యూనిట్‌కు రూ. 6.30, ఎల్‌టీ కనెక్షన్‌కు రూ.6.70గా విద్యుత్తు ఛార్జీలు వసూలు చేస్తున్నాం. ఇకపై యూనిట్‌కు రూ.2 తగ్గిస్తాం...’ ఇదీ 2022 ఆగస్టు 24న చీమకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన.

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు , న్యూస్‌టుడే, చీమకుర్తి: ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటనతో జిల్లాలోని గ్రానైట్‌, పాలిషింగ్‌ యూనిట్ల యజమానులు ఎంతగానో సంతోషించారు. తమకు ఏ మేరకు ప్రయోజనాలు చేకూరుతాయో లెక్కలు కూడా వేసుకున్నారు. 20 నుంచి 25 వేల యూనిట్ల విద్యుత్తును ఉపయోగించే పరిశ్రమలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు బిల్లు తగ్గుతుందని అంచనా వేసుకున్నారు. 22 క్యూబిక్‌ మీటర్లకు ఇప్పటి వరకు రూ.లక్షకు పైగా కట్టే రాయల్టీ కూడా రూ.27 వేలకు తగ్గుతుందని ఆశపడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ హామీ ఇచ్చి.. జీవో జారీ చేసి పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ విద్యుత్తుపై రూ.2 రాయితీ అమలే కాలేదు. సాక్షాత్తు సీఎం చెప్పడంతో పలువురు స్లాబ్‌ విధానంలోకి మారారు. అయితే ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుందన్న ఉద్దేశంతో సీనరేజ్‌ వసూలు ప్రైవేట్‌కు కట్టబెట్టారు. దీంతో స్లాబ్‌ విధానం రద్దవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందక.. అటు వ్యాపారం లేక పరిశ్రమలను మూసివేసే పరిస్థితి తలెత్తనుందని గ్రానైట్‌ కటింగ్‌ యూనిట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* పాత విధానంలోనే వసూళ్లు...: కొవిడ్‌ పరిస్థితుల కారణంగా జిల్లాలోని గ్రానైట్‌ యూనిట్ల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఎగుమతులు నిలిచి.. కార్యకలాపాలు ఆగిపోయి ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని పలు దఫాలుగా ఇటు గనుల శాఖ అధికారులు, అటు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో ప్రధానంగా రాయల్టీ తగ్గించాలని, స్లాబ్‌ విధానాన్ని అమలు చేయాలని, విద్యుత్తు రాయితీ ఇచ్చి పరిశ్రమను ఆదుకోవాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో 2022 ఆగస్టు 24న సీఎం జగన్‌ చీమకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ మేరకు హామీ, ప్రకటన చేశారు. దీంతో ఉమ్మడి ప్రకాశంలో దాదాపు 2 వేల వరకు గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లకు మంచి రోజులు రానున్నాయని ఆశించారు. దాదాపు 4,500కు పైగా బ్లేడ్లు జిల్లాలోనే ఉండటంతో ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుందని భావించారు. అయితే అధికారులు మాత్రం పాత విధానమే అమలు చేస్తున్నారు. ఆ ప్రకారమే వసూళ్లు చేపడుతున్నారు.  

* కార్మికుల ఉపాధికి చేటు...: సీఎం ప్రకటన తర్వాత గతేడాది నవంబరు నుంచి స్లాబ్‌ విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దాదాపు సగం యూనిట్లు ఆ దిశగా మార్పులు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో సీనరేజ్‌ వసూలును దక్కించుకున్న ప్రైవేట్‌ వ్యక్తులు తమ ఆదాయం కోసం స్లాబు విధానాన్ని నీరుగార్చారు. ఈ పద్ధతిపై పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్లాబ్‌ విధానం రద్దు అయితే వ్యాపారం లేక పరిశ్రమలను మూత వేసుకోవాల్సి వస్తుందని.. అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పోతారని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని