logo

బదిలీలు.. అష్టకష్టాలు

బదిలీ ప్రక్రియలో లోపాలు ఉపాధ్యాయులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఏ అంశంలోనూ స్పష్టత లేకపోవడంతో ఎవరిని అడగాలో.. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండి పోతున్నారు.

Published : 06 Jun 2023 03:23 IST

అవస్థలకు గురిచేస్తున్న ఐచ్ఛికం
మొరాయించిన ఆన్‌లైన్‌ సేవలు
లోపాలపై ఉపాధ్యాయుల ఆగ్రహం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: బదిలీ ప్రక్రియలో లోపాలు ఉపాధ్యాయులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఏ అంశంలోనూ స్పష్టత లేకపోవడంతో ఎవరిని అడగాలో.. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండి పోతున్నారు. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో ఐచ్ఛికాలు(ఆప్షన్లు) పెట్టుకునేందుకు షెడ్యూల్‌ ప్రకటించారు. కానీ ఇంతవరకు సంబంధిత సైట్‌ తెరుచుకోలేదు. సోమ, మంగళవారాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంది. ఉదయం పనిచేయాల్సిన వెబ్‌సైట్‌ సాయంత్రానికి కానీ తెరుచుకోలేదు. అదికూడా హెచ్‌ఎంలకు సంబంధించినది మాత్రమే. స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించిన వెబ్‌సైట్‌ ఇంకా సిద్ధం కాలేదు. 5, 6 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్లు, 5, 6, 7 తేదీల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ఆప్షన్లు పెట్టుకోవాలని షెడ్యూల్‌ ఇచ్చారు. అయితే తొలిరోజే నిరాశ ఎదురు కావడం గమనార్హం. హెచ్‌ఎంలు నెట్‌ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. అధికారులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. హెచ్‌ఎంలకు రెండు రోజులే ఐచ్ఛికాలకు సమయం ఇవ్వడం.. అందులోనూ ఒకరోజు ఇప్పటికే గడిచి పోవడంతో ఖాళీలు చూసుకుని ఐచ్ఛికాలను ఎన్నుకునేందుకు సమయం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఉపాధ్యాయులు ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తే ఒత్తిడి పెరిగిపోయి వెబ్‌సైట్‌ పనిచేస్తుందా లేదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో దాదాపు 200 మంది హెచ్‌ఎంలు మంగళవారం రాత్రి 12లోపు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంది.

సమాచారం కోసం మల్లగుల్లాలు...

ఉమ్మడి ప్రకాశంలో 6,066 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎస్జీటీలు 3,347 మంది. సాధారణ విధానంలో కాకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రవేశపెట్టడంతో సమస్య తలెత్తింది. అందుకు అనుగుణంగా వెబ్‌సైట్‌ను ఆధునికీకరించక పోవడం ఉపాధ్యాయుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎస్జీటీల విషయానికొస్తే సీనియారిటీ ప్రకారం వారికి వచ్చిన పాయింట్లు ఆధారంగా వారికో సంఖ్య కేటాయిస్తారు. ఉదాహరణకు తన సంఖ్య వెయ్యి అయితే వెయ్యి ఖాళీలను వరుసగా ఆప్షన్‌ పెట్టుకోవాలి. ఇందుకు గంటల కొద్దీ సమయం పడుతుంది. ఆదీ వేగంగా చేస్తేనే సాధ్యం. కంప్యూటర్‌ పరిజ్ఞానం తక్కువుగా ఉన్నవారికి ఇబ్బందులే. సేవ్‌ ఆప్షన్‌ లేకుండా విధానం ప్రవేశపెట్టడం వల్ల ఏదైనా తప్పు దొర్లితే మళ్లీ మొదటికి రావాల్సి వస్తుందంటున్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, సాంకేతిక లోపాలు తలెత్తితే మరింత సమయం పడుతోంది. వేలాదిమంది ఇంత తక్కువ సమయంలో ఐచ్ఛికాలు పెట్టుకోవడం తలనొప్పిగా మారింది. ఒక మండలంలో పనిచేసే ఉపాధ్యాయుడుకి చట్టుపక్కల 30 నుంచి 40 పాఠశాలల గురించి మాత్రమే తెలుస్తుంది. వేలసంఖ్యలో ఆప్షన్లు పెట్టుకోవాలంటే ఆయా పాఠశాలల స్థితిగతులు గురించి తెలుసుకోవాలి. ఈ సమాచారం సేకరణతో మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని