Chandrababu: హనుమాయమ్మ మృతిపై జోక్యం చేసుకోండి: చంద్రబాబు

అంగన్‌వాడీ టీచర్‌ హనుమాయమ్మ మృతిపై జోక్యం చేసుకోవాలని డీజీపీ సహా పలువురు అధికారులకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖలు రాశారు.

Updated : 06 Jun 2023 16:32 IST

అమరావతి: ప్రకాశం జిల్లాలో తెదేపా నేత భార్య, హనుమాయమ్మ మృతిపై డీజీపీ సహా పలువురు అధికారులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. ఎస్సీ మహిళ మృతిపై జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా లేఖలు రాశారు. హనుమాయమ్మ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరారు. ఘటనలో వైకాపా నేతలకు పోలీసుల సహకారంపైనా విచారించాలన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

టంగుటూరు మండలం రావివారిపాలేనికి చెందిన  తెదేపా ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌ భార్య హనుమాయమ్మను సోమవారం కొండలరావు అనే వ్యక్తి ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్య చేసిన సంగతి తెలిసిందే. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి అనుచరుడిగా సుధాకర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సుధాకర్‌ భార్య హనుమాయమ్మ అదే గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌. స్థానిక వైకాపా నాయకుడు సవలం కొండలరావు, సుధాకర్‌ కుటుంబాల మధ్య పొలం తగాదాలున్నాయి. సోమవారం వైకాపా నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు తూర్పునాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు. దీన్నిఅడ్డుకునేందుకు తెదేపా శ్రేణులతోపాటు సుధాకర్‌ ఉదయాన్నే తూర్పునాయుడుపాలెం వెళ్లారు. ఇదే సమయంలో ఉదయం అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లిన హనుమాయమ్మ.. మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చారు. ఇంటి ఎదుట రహదారి పక్కన నిల్చుని కుమార్తె మాధురిని మంచినీళ్లు తేవాలని పిలిచారు. ఆమె నీళ్లు తెచ్చి తల్లికిచ్చి తిరిగి లోపలికి వెళ్లారు. ఇంటి గోడ పక్కన నిల్చుని మంచినీళ్లు తాగుతున్న హనుమాయమ్మను అప్పటికే అక్కడ ట్రాక్టర్‌తో వేచి ఉన్న సవలం కొండలరావు వేగంగా వెనక్కి వచ్చి గొర్రుతో ఢీకొట్టాడు. కింద పడిన ఆమె ఇంకా ప్రాణాలతో ఉందేమో అనే అనుమానంతో మరోసారి ట్రాక్టర్‌తో తొక్కించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని