logo

కొండల్ని మింగేశారు

దర్శి పట్టణంలోని కొండలు పచ్చదనంతో కళకళలాడుతుండేవి. ప్రకృతి ప్రేమికులను ఎంతో అలరించే ఆ ప్రాంతంలోని పచ్చదనానికి అక్రమార్కులు సమాధి కట్టారు.

Updated : 09 Jun 2023 06:09 IST

చెలరేగిపోతున్న వైకాపా నేతలు
మట్టి మాఫియాకు యంత్రాంగం వత్తాసు

దర్శి- కురిచేడు ప్రధాన రహదారి పక్కనే తరిగిపోయిన కొండ ప్రాంతం

దర్శి, న్యూస్‌టుడే: దర్శి పట్టణంలోని కొండలు పచ్చదనంతో కళకళలాడుతుండేవి. ప్రకృతి ప్రేమికులను ఎంతో అలరించే ఆ ప్రాంతంలోని పచ్చదనానికి అక్రమార్కులు సమాధి కట్టారు. కొండ మట్టి తవ్వకాలను మంచి ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. యంత్రాల సాయంతో యథేచ్ఛగా తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపం నుంచి నిత్యం పెద్దఎత్తున టిప్పర్లు దూసుకుపోతున్నా యంత్రాంగం మొద్దునిద్ర నటిస్తోంది. పట్టణంలోనే పలు ప్రాంతాల్లో మట్టిని నిల్వ చేసి విక్రయాలు జరుపుతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది.

దర్శి పట్టణంలో నిల్వ చేసిన మట్టి

పచ్చని చెట్లను కూల్చేసి...: దర్శి - కురిచేడు ప్రధాన రహదారి పక్కనే ప్రకృతికి ఆలవాలంగా ఉన్న కొండ ప్రాంతంలో ఇటీవలకాలంలో ఈ అక్రమ మట్టి తవ్వకాలు ఊపందుకున్నాయి.  ఇప్పటికే 20 శాతం కొండ మాయమైంది. అడ్డుగా ఉన్న పచ్చని చెట్లను కూల్చేసి మరీ మట్టిని సేకరిస్తున్నారు. వెంకటాచలంపల్లి గ్రామ శివారు ప్రాంతంలో జిల్లా నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో గతంలో మొక్కలు పెంచిన కొండను సైతం ఛిద్రం చేసేశారు. ఇప్పటికే మూడోవంతు ప్రాంతంలో మట్టిని తరలించుకుపోయారు. సహజ పచ్చదనంతో పాటు, ఎంతో కష్టించి పెంచి పెద్దచేసిన మొక్కలను కూడా నరికేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దర్శి- దొనకొండ మార్గంలో మరో కొండ, చలివేంద్ర వద్ద నున్న కొండ ప్రాంతాలు కూడా మట్టి మాఫియాకు అడ్డాగా మారాయి. ఇప్పటికే మండలంలో తవ్వకాలతో చెరువులు, వాగులు వాటి రూపురేఖలు కోల్పోయాయి. కొండలు కూడా కనుమరుగైతే పర్యావరణానికి పూర్తిగా హాని జరుగుతుందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయ వనరుగా..

అధికార పార్టీ నాయకులకు కొండ మట్టి రవాణా ప్రధాన ఆదాయ వనరుగా మారింది. లే అవుట్లకు, నిర్మాణాల సమయంలో మెరక పూడికలకు కొండ మట్టి అనువుగా ఉండటంతో ట్రాక్టర్‌ రూ.600 నుంచి రూ.800, ట్రక్కు రూ.2500 నుంచి రూ.3000 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దర్శి మండలంతో పాటు ముండ్లమూరు, దొనకొండ, కురిచేడు మండలాల్లోని పలు ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారు. తవ్వకాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.


అక్రమంగా తరలిస్తే చర్యలు

అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. రాత్రి సమయంలో తవ్వుతున్నట్లు  తెలిసింది. సిబ్బందిని పంపి అడ్డుకుంటాం. ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.  

రవిశంకర్‌, ఉప తహసీల్దార్‌, దర్శి


అధికారం అండతో పాలకపక్ష నేతలు చెలరేగిపోతున్నారు. యథేచ్ఛగా మట్టిని తవ్వేసి కొండల్ని మింగేస్తున్నారు. ఈ ఆగడాలు బహిరంగంగా సాగుతున్నా మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేసేవారు కరవయ్యారు. దర్శిలో సాగుతున్న ఈ దందాపై కథనం..


 

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు