logo

శుభ కార్యానికి వెళ్లి విగతజీవిగా..

శుభ కార్యానికి సంతోషంగా బయలుదేరిన ఆ వివాహిత విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటన గురువారం కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల సమీపంలో చోటు చేసుకుంది.

Published : 09 Jun 2023 04:59 IST

సుందరరావు మృతదేహం

పొదిలి గ్రామీణం, న్యూస్‌టుడే: శుభ కార్యానికి సంతోషంగా బయలుదేరిన ఆ వివాహిత విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటన గురువారం కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొదిలి మండలం నందిపాలేనికి చెందిన మీనిగ వెంకటేశ్వర్లు భార్య వెంకటలక్ష్మి (31) కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి కనిగిరి మండలం యడవల్లిలో జరిగే వివాహ వేడుకకు వెళ్లారు. గురువారం తెల్లవారు జామున ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు.  వారి వాహనం పెద్దారికట్ల సమీపంలోకి రాగానే ఒక్కసారిగా గేదెల మంద రోడ్డు పైకి వచ్చింది. దీంతో ఆటో ఓ గేదెను ఢీకొని అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆటో చోదకుడికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి భర్త వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొనకనమిట్ల హెడ్‌కానిస్టేబుల్‌ బాపూజీ తెలిపారు.

ఉప్పుగుండూరులో..

నాగులుప్పలపాడు: ఓ వృద్ధుడు ఆకస్మికంగా మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకొంది. ఎస్సై హరిబాబు కథనం మేరకు... జరుగుమల్లి మండలం సాధువారిపాలేనికి చెందిన పాటిబండ్ల సుందరరావు(65) బుధవారం ఉప్పుగుండూరులోని బంధువుల ఇంటిలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. అయితే గురువారం ఉదయం ఊరుబయట ఉన్న ఓ చెట్టు కింద ఆయన విగతజీవిగా పడి ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తగిలి మృతిచెంది ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు సురేష్‌  బుధవారం నుంచి తన తండ్రి కోసం గాలింపు చేపడతుండగా, ఈ దుర్వార్త తెలిసిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని