logo

చంద్రబాబుకే రాష్ట్ర ఆదాయం పెంచే సత్తా

సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయం పెంచే సత్తా ఒక్క చంద్రబాబునాయుడికే ఉందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు.

Published : 10 Jun 2023 05:57 IST

ఓట్లు కొంటామనే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

మాట్లాడుతున్న ఉగ్రనరసింహారెడ్డి, వేదికపై పరిశీలకుడు నాగేశ్వరరావు, నాయకులు

కనిగిరి, న్యూస్‌టుడే: సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయం పెంచే సత్తా ఒక్క చంద్రబాబునాయుడికే ఉందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. స్థానిక అమరావతి మైదానంలో శుక్రవారం నిర్వహించిన  ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. వైకాపా పాలనలో ట్రిపుల్‌ఐటీ, నిమ్జ్‌, నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణం ఆగిపోయాయన్నారు. పింఛన్లు, రైతు భరోసా ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తారని, జగన్‌ ప్రభుత్వానికే సొంతం కాదని చెప్పారు. కొందరు గ్రూపులు కడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే సంపూర్ణ సహకారం ఉంటుందని వెల్లడించారు. ఓటుకు రూ. 3 వేలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటామని ప్రచారం చేసుకునేవారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. నోటుకు ఓటు వేసే రోజులు కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పాలకులు కావాలని జనం కోరుకుంటున్నారన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా మోసపోయేందుకు కనిగిరి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తే తాము తగు రీతిలో బుద్ధి చెబుతామన్నారు. నియోజవర్గ పరిశీలకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కొక్క తలపై లక్షల రూపాయల అప్పుల భారం మోపారన్నారు. నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తానని మోసం చేశారన్నారు. తన సొంత బాబాయినే హత్య చేస్తే ఇంతవరకు ఎవరో తేల్చలేక పోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం భవిష్యత్తుకు గ్యారెంటీ మినీ మేనిఫెస్టో గోడప్రతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, అడుసుమల్లి ప్రభాకర్‌ చౌదరి, నంబుల వెంకటేశ్వర్లు, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, పువ్వాడి వెంకటేశ్వర్లు, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, వివిమనోహారరావు, గంగరాజు యాదవ్‌, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, వాజిదాబేగం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని