logo

బలరాం ఇంట్లో బాలినేని

జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి ప్రకాశంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి.

Published : 10 Jun 2023 06:10 IST

అక్కడ పవన్‌తో స్వాములు భేటీ      

బాలినేని, కరణంతో నాయకులు, కార్యకర్తలు

ఇక్కడ మంతనాలుఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి ప్రకాశంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల వరకు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పరిణామాలకు కేంద్ర బిందువుగా మారారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో రెండోసారి భేటీ అయిన అనంతరం కూడా ఆయన మౌనముద్ర పాటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సాగిన ఒక భేటీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి చెందిన ఒంగోలు నివాసానికి బాలినేని శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైకాపా పర్చూరు నియోజకవర్గ బాధ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఇటీవల కలిశారు. చీరాల, దర్శి నేతలతో కలిసి భారీ ప్రదర్శనగా వెళ్లి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఈ నెల 12న ఆయన జనసేనలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నివాసంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తన సోదరుడు కృష్ణమోహన్‌ వైకాపా పర్చూరు నియోజకవర్గ బాధ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే స్వాములు పవన్‌ కల్యాణ్‌ను కలవడం రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. బాలినేని, కరణం భేటీలో ప్రధానంగా ఈ అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని