logo

పండగ వేళ పెను విషాదం

పండగ వేళ పెను విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒంగోలు - చీరాల రహదారిలో నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది.

Updated : 18 Sep 2023 06:37 IST

ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొని ముగ్గురి దుర్మరణం

ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: పండగ వేళ పెను విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒంగోలు - చీరాల రహదారిలో నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు మర్రిబోయిన మణికంఠ (21) మర్రిబోయిన గోపి (27), బత్తిన అరవింద్‌ (19)... వినాయక విగ్రహం కొనుగోలుకు శనివారం రాత్రి ఒంగోలు వచ్చారు. విగ్రహం కొనుగోలు చేశాక... నగరంలోనే రాత్రి బస చేశారు. ఆదివారం తెల్లవారుజామున అయిదు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. ఓ మినీ కంటెయినర్‌ లారీ టైరు పంక్చర్‌ కావడంతో... సదరు చోదకుడు మద్దిరాలపాడు సమీపంలో రహదారి పక్కన వాహనం నిలిపి ఉంచాడు. తెల్లవారుజాము సమయం కావడంతో... ఆ వాహనాన్ని సరిగా గుర్తించని యువకులు వెనుకగా ఢీకొట్టారు. ఆ ధాటికి బైకు కంటెయినర్‌ కిందకు దూసుకుపోయి... వాహనం నడుపుతున్న మణికంఠ సహా మిగతా ఇద్దరూ వెనక్కు పడిపోయారు. ముగ్గురికీ ఛాతీపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఒంగోలు తాలూకా సీఐ భక్తవత్సల రెడ్డి సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో గోపికి వివాహమై... భార్య, ఏడాది వయసు కలిగిన బాబు ఉన్నారు. మిగిలిన ఇద్దరూ అవివాహితులు. విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జీజీహెచ్‌ వద్ద మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌... జీజీహెచ్‌ వద్ద బాధిత కుటుంబీకులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు