logo

Ongole: ‘ఆ డైరీలో ఏముందో’ తెరుస్తారా! తేల్చేస్తారా!!

ఒంగోలులో ఓ గద్దల ముఠా ప్రైవేట్‌ భూములు, ఆస్తులను తన్నుకుపోతోంది. వివాదాలు సృష్టిస్తూ అందిన కాడికి దండుకుంటోంది. ఈ ముఠా భూబాగోతాలు ఇటీవల వెల్లడయ్యాయి.

Updated : 03 Oct 2023 12:37 IST

వివరాలన్నీ రాత పూర్వకం ‌
గద్దలపై ఆగని ఫిర్యాదుల పర్వం ‌
బద్దలయ్యేనా ఒంగోలు భూ కుంభకోణం
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే

ఒంగోలులో ఓ గద్దల ముఠా ప్రైవేట్‌ భూములు, ఆస్తులను తన్నుకుపోతోంది. వివాదాలు సృష్టిస్తూ అందిన కాడికి దండుకుంటోంది. ఈ ముఠా భూబాగోతాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఒక్క నగరానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడికి చెందిన వ్యక్తుల ప్రమేయంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించాయి. జిల్లాలోని ఒంగోలుతో పాటు మార్కాపురం, కనిగిరి, పొదిలి.. అలాగే గుంటూరు, విశాఖపట్నంలోనూ కోట్ల రూపాయల విలవైన భూములను నకిలీ పత్రాలతో ఈ ముఠా వివాదాల్లోకి లాగింది. సదరు స్థలాలను రిజిస్ట్రేషన్‌ సైతం చేయించినట్లుగా సబ్‌ రిజిస్ట్రార్ల ముద్రలతో పత్రాలను కూడా సిద్ధం చేసింది. అలా ఈ ముఠా పౌరుల ఆస్తులను వివాదాల్లోకి లాగి భారీగా దండుకుంది. ఈ ముఠా వద్ద జిల్లాలోని దాదాపు అందరు తహసీల్దార్ల ముద్రలతో పాటు సబ్‌ రిజిస్ట్రార్లవి, ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులవి కూడా ఉన్నాయి. వీటిని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వందల సంఖ్యలో నకిలీ వీలునామాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు లభించాయి. ఇందులో నిందితుల అరెస్టుకు ముందురోజు సిద్ధం చేసిన పత్రాలు కూడా ఉండటం గమనార్హం. ఈ పరిణామాలు సాధారణ ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తమ ఆరుగాల కష్టార్జితం ఎంత భద్రం అనే కలవరానికి కారణమయ్యాయి.

ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టు కావటంతో ఈ ముఠా ఆగడాలపై పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.

ఇంతకీ అందులో ఎవరెవరున్నారో..?: పోలీసులకు పట్టుబడిన నిందితుల్లో కీలకమైన పూర్ణ అనే వ్యక్తికి డైరీ రాసే అలవాటుంది. తన దైనందిన కార్యకలాపాలతో పాటు ఆర్థిక లావాదేవీలను కూడా అందులో పొందుపరిచినట్లు సమాచారం. రూ.500 లావాదేవీని కూడా రాసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసు విచారణలో ఇప్పుడు ఆ డైరీ అత్యంత కీలకంగా మారింది. అందులో ఎవరెవరి పేర్లున్నాయి. వారితో ఏమేరకు లావాదేవీలు సాగాయి. ఎవరెవరు ఎంత మేర లబ్ధి పొంది ఉంటారనే అంశాలన్నీ అందులో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిలో ఇప్పుడు గుబులు మొదలైంది. వీరిలో అత్యధికులు రాజకీయాలతో ప్రమేయం ఉన్నవారు, నాయకులకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు, కార్పొరేటర్లు కావడం గమనార్హం. దీంతో పోలీసులు లాగిన తీగకు ఏ డొంక కదులుతుందో, రాజకీయంగా ఎవరి కొంప ముంచుతుందోననే పలువురు నాయకులు ఆందోళన చెందుతున్నారు.

వికృత క్రీడలో సామాన్యులే సమిధలు...: ఒంగోలు నగరంలో డీకే పట్టాల వివాదాలు ఎన్నో ఉన్నాయి. నగర శివారు ప్రాంతాలైన బలరామ్‌ కాలనీ, కేశవరాజుకుంట, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో చాలాచోట్ల స్థల వివాదాలు అధికం. ఒక స్థలానికి రెండు, మూడు నకిలీ పట్టాలు సృష్టించారు. వీటికి సంబంధించిన వివాదాలపై ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో నిత్యం పంచాయితీలు సాగుతూనే ఉంటాయి. అధికారుల ముద్రలు, సంతకాలతో నకిలీ డీకే పట్టాలు సృష్టించడం నుంచి తమ ప్రస్థానం ప్రారంభించిన ఈ ముఠా.. ఆ తర్వాత ప్రైవేట్‌ స్థలాలు, రైతులకు చెందిన వ్యవసాయ భూములపై దృష్టిపెట్టింది. అన్నింటికీ నకిలీ వీలునామాలు, దస్తావేజులు సృష్టించి దందా సాగించింది. డీకే పట్టాల వివాదాలను పోలీసులు మొదట్లో తేలిగ్గా తీసుకున్నారు. ఇదే అక్రమార్కులకు ఆసరాగా మారింది. ఒంగోలు నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి అక్కడి నుంచి గుంటూరు, విశాఖపట్నం వరకు పాకింది. చివరికి ఈ గద్దల ముఠా సాగించిన వికృతక్రీడలో సామాన్యులు సమిధలుగా మారారు. ఈ కుంభకోణంపై నియమించిన విచారణ కమిటీ ఆ డైరీని తెరుస్తుందా.. అసలు నిజాలను నిగ్గు తేలుస్తుందా.. తెర వెనుక సూత్రధారులను బోనెక్కిస్తుందా.. బాధితులకు సాంత్వన కలిగిస్తుందా.. అనేది త్వరలో తేలాల్సి ఉంది.


ఎంతవారలైనా...

- ఇవీ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు

ఒంగోలులో నకిలీ వీలునామాలు, దస్తావేజులతో సామాన్య ప్రజల ఆస్తులను దురాక్రమించిన కేసులో నిందితులు ఎంతటి వారైనా సహించేది లేదు. అందులో ఏ పార్టీ ప్రమేయం ఉన్న వారైనా వదిలిపెట్టేది లేదు. నిందితులకు శిక్ష పడాల్సిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి దోషులెవరో తేల్చాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను కోరాం. బాధితులు తమకు వాటిల్లిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో పాటు నా దృష్టికి కూడా తీసుకురావచ్చు. వారికి కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాం.. వారి భూములను వారికి అప్పగించి తీరుతాం.  


విచారణకు ఓ కమిటీ ఏర్పాటు...

 - ఇవీ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ మాటలు

కిలీ స్టాంపులు, రిజిస్ట్రేషన్లతో సాగించిన అక్రమ భూ వ్యవహారాలు, లావాదేవీలపై దృష్టి సారించాం. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే జరిగిన, జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాం. ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎస్పీతోనూ చర్చించాం. ఈ కుంభకోణంపై జేసీ శ్రీనివాసులును విచారణాధికారిగా నియమించాం. ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు, దర్శి డీఎస్పీ, రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీలతో కూడిన బృందాన్ని విచారణకు ఏర్పాటు చేశాం. అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేలుస్తాం. బాధితులకు న్యాయం చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని