logo

నమూనాలు లేవు.. కేసులూ లేవు..

గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు. మరోపక్క నమూనాల సేకరణ సైతం ఆగిపోయింది.

Published : 05 Oct 2022 05:31 IST

జిల్లా కేంద్రంలోనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు
న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)

గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు నమోదు కాలేదు. మరోపక్క నమూనాల సేకరణ సైతం ఆగిపోయింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి మినహా మండలాల పరిధిలోని పీహెచ్‌సీల్లో కరోనా శాంపిళ్లు తీసే కేంద్రాలను సైతం అధికారులు ఎత్తివేశారు. పదిరోజుల కిందట వరకూ రోజుకు సగటున 200-300 వరకూ నమూనాలు తీస్తే పది కేసులు లోపు నమోదయ్యేవి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షలు లేకపోవడంతో అనుమానితులు జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

వాస్తవానికి ల్యాబ్‌లో పరీక్షలు చేయాలంటే రోజుకు కనీసం 96 శాంపిళ్లు ఉండాలి. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గిపోయిందని భావించిన జిల్లా అధికారులు పరీక్షా కేంద్రాలను రద్దు చేయడంతో చేయించుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. గ్రామాల్లో వివిధ రకాల జ్వరాలు విజృంభిస్తున్నాయి. వీరిలో చాలామంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. వైద్యులు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో చేసేది లేక జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సర్వజన ఆసుపత్రిలో ఒకే ఒక్క కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడి ల్యాబ్‌లో ఇద్దరు టెక్నీషియన్లు మాత్రమే ఉన్నారు. సైంటిస్ట్‌ లేకపోవడంతో నోడల్‌ అధికారే పర్యవేక్షిస్తున్నారు.

వాహనాలనూ ఆపేశారు..  మండల పరిధిలోని పీహెచ్‌సీల్లో తీసిన నమూనాలను జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌కు తీసుకురావాలి. ఇందుకోసం జీపులు, కార్లను వినియోగించేవారు. గత ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం వీటిని  నిలిపివేసింది. జిల్లాలో మాత్రం కలెక్టర్‌ చొరవతో ఒక వాహనం నడిపేవారు. ప్రస్తుతం వారికి కూడా బిల్లులు చెల్లించకపోవడం, డీజిల్‌ సరఫరా చేయకపోవడంతో చేతలెత్తేశారు. జిల్లా నుంచి విదేశాలకు వెళ్లి వస్తున్న వారికి సర్వజనాసుపత్రిలో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నా నివేదిక సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జైలుకు తరలించాల్సిన నిందితులు, ముద్దాయిలకు తరచూ పరీక్షలు చేయాల్సి వస్తోంది. వీరికి నివేదికలు త్వరగా రావడం లేదు.


కలెక్టరుకు తెలియజేశాం..


సర్వజన ఆసుపత్రిలో కొవిడ్‌ పరీక్ష కేంద్రం

వాహనాలు పునరుద్ధరించే విషయం కలెక్టర్‌ తెలియజేశాం. దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. డీజిల్‌ సమస్య పరిష్కరిస్తారు. ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.

- బి.మీనాక్షి, డీఎంహెచ్‌వో, శివాజీ, నోడల్‌ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని