logo

రాజమ్మ సంబరం.. చూసొద్దాం రండి..!

గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి(రాజమ్మ తల్లి) పీఠాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. జిల్లా నలుమూలల నుంచి శనివారం సాయంత్రానికే ఈ ప్రాంతానికి చేరుకుని పూజల్లో పాల్గొంటారు.

Updated : 03 Feb 2023 05:42 IST

న్యూస్‌టుడే, గార

అమ్మవారి ఆలయం వద్ద భక్తులు (పాత చిత్రం)

గార మండలం వత్సవలస పంచాయతీ చిన వత్సవలసలో ఆధ్యాత్మిక సందడి మొదలుకానుంది. ఏటా మాఘమాసంలో ప్రారంభించి ఫాల్గుణమాసం వరకు నాలుగు వారాల పాటు రాజరాజేశ్వరి అమ్మవారి జాతర నిర్వహిస్తారు. వరుసగా శని, ఆదివారాలు గ్రామంలోని అమ్మవారి ఆలయాలు, శక్తి పీఠాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నెల 4వ తేదీ నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవం విశిష్టత, సన్నద్ధతపై ‘న్యూస్‌టుడే’ కథనం...

గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి(రాజమ్మ తల్లి) పీఠాలు ఇబ్బడిముబ్బడిగా ఉంటాయి. జిల్లా నలుమూలల నుంచి శనివారం సాయంత్రానికే ఈ ప్రాంతానికి చేరుకుని పూజల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడే పరిసర జీడిమామిడి తోటల్లో పిల్లలు, కుటుంబసభ్యులతో రాత్రి తలదాచుకుంటారు. ఆదివారం వేకువజామున సమీపంలోని సముద్రంలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా రాజమ్మ తల్లిని భక్తులు భావిస్తారు. గొర్రెలు, మేకలు, కోళ్లు, నగదు, బియ్యం, బట్టలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తల్లిని కొలిచి తమ మొక్కులను దాసుడి(అమ్మవారిని కొలిచి పూజలు చేసేవారు) సమర్పించుకుంటారు. ఆ తరువాత అక్కడే వంటావార్పు చేసుకొని తిరుగుప్రయాణమవుతారు.


స్థల పురాణమిదీ..

పూసపాటి రాజుల ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి దేవి. బొబ్బిలి యుద్ధానికి ముందు అమ్మవారు విజయరామరాయలు కలలో బాలిక రూపంలో కనిపించి బొబ్బిలి సామ్రాజ్యం వేరే రాజ్యంలో కలిసిపోనుందని చెబుతుంది. తమను కాపాడలేని దేవతకు పూజలెందుకని భావించి అమ్మవారితో పాటు ఇతర దేవతల ప్రతి రూపాలను చెక్కపెట్టెలో ఉంచి సమీప నదిలో పడేస్తారు. ఆ చెక్కపెట్టె వత్సవలస సమీపంలోని మైలపల్లి వంశస్థులైన కొందరు జాలర్లుకు దొరుకుతుంది. పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు దాసుడు వివరించారు.  

పకడ్బందీగా బందోబస్తు... రాజమ్మతల్లి జాతర సందర్భంగా ఈ ప్రాంతంలో మద్యం, సారా అమ్మకాలు విస్తృతంగా జరుగుతాయి. గతంలో వ్యాపార దుకాణాల్లో మద్యం విక్రయాలు బహిరంగంగానే జరిగేవి. కొన్నేళ్ల నుంచి అది గుట్టుగా సాగుతోంది. ఇప్పటికే పరిసర గ్రామాలైన అంపోలు, శ్రీకూర్మం, గార, కళింగపట్నం ప్రాంతాలు నుంచి మద్యం, శ్రీకూర్మం పరిసర ప్రాంతాలు నుంచి సారా చినవత్సవలస చేరుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు రాకపోకలు క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.


సౌకర్యాలు  శూన్యం...

వసతి సదుపాయం లేక ఆరుబయటే తలదాచుకోవాలిలా..

ఏటా ఫిబ్రవరిలో నాలుగు వారాల పాటు ఈ ప్రాంతానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తుంటారు. కానీ వారికి సరైన సౌకర్యాల్లేక ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. మంచినీరు, మరుగుదొడ్డి సదుపాయం వంటి కనీస అవసరాలు కూడా ఉండవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్థానిక సరుగుడు, జీడిమామిడి చెట్లు కిందే పందిళ్ల మాదిరి గుడారాలు ఏర్పాటు చేసుకుని భక్తులు రాత్రి నిద్రచేస్తారు. సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.


ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు..

గ్రామంలో మంచినీటి సమస్య దృష్ట్యా రెండున్నర లక్షలు వెచ్చించి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాం. బహిరంగ మద్యం విక్రయాలు కట్టడి చేశాం. ప్రస్తుతానికి 14 కుటుంబాలు మూడు వారాల పాటు ఈ జాతర నిర్వహిస్తాయి. మిగతా రోజుల్లో సాధారణ పూజలు జరుగుతాయి. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.

శ్రీను, దాసుడు, చినవత్సవలస

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని