logo

తూచ్‌.. ముహూర్తం మారింది!

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ఉగాది నాటికి పూర్తి చేయాలని నిర్ణయించిన ముహూర్తం మరోసారి మారింది.

Updated : 21 Mar 2023 07:07 IST

జిల్లా వ్యాప్తంగా 33,241 ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదారులు పూర్తిచేసేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటికి 22,421 ఇళ్లు పూర్తయ్యాయి.

మరో వారం రోజుల్లో 4,500 గృహాలు పూర్తయ్యేలా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ఉగాది నాటికి పూర్తి చేయాలని నిర్ణయించిన ముహూర్తం మరోసారి మారింది. గృహ ప్రవేశానికి అనువుగా లక్ష్యం మేరకు ఇళ్లు సిద్ధం కాకపోవడమే వాయిదా వేయడానికి కారణమని తెలిసింది.

* గత ఏడాది డిసెంబరు 21న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గృహప్రవేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జిల్లాలో 28,026 ఇళ్లు లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లే అవుట్లలో సమస్యలు పరిష్కరించి పనులు ప్రారంభించడంలో ఆటంకాలను కొలిక్కి తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఉగాది (ఈనెల 22) నాటికి లక్ష్యం మేరకు పూర్తి చేయాలని తేదీ ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటం, సమయానికి బిల్లులు రాకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, ప్రభుత్వం సకాలంలో సామగ్రి అందించకపోవడం, రవాణా ఖర్చులు రెట్టింపు కావడం వంటి సమస్యలు తలెత్తాయి. మరికొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో లక్ష్యం చేరుకోలేక సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం వాయిదా వేశారు.

జాప్యమే కారణం

ఇళ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యంతోనే పంపిణీ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా 74,654 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 7,800 గృహాల నిర్మాణం ప్రారంభం కాలేదు. 24 వేలు పునాది స్థాయి లోపే ఉండగా 10 వేల వరకు పునాది స్థాయి దాటాయి. మరో ఐదు వేలు స్లాబు దశకు చేరుకున్నాయి. సుమారు 4,500 ఇళ్ల స్లాబు పూర్తికాగా 22,421 ఇళ్లు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.


తేదీ ఖరారు కావాలి..

ఉగాది నాటికి ఇళ్లు పూర్తికావాలనే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ఉండటం, ఆయా పనులు అధికారులకు అప్పగించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సామూహిక గృహప్రవేశాలు నిర్వహించే తేదీని ఖరారు చేయాల్సి ఉంది. వారం రోజుల్లో మరో 4,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అధిగమిస్తాం.


నక్క గణపతి, గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకుడు, శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని