logo

బడుల బాగుకు పీఎంశ్రీ

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.

Published : 21 Mar 2023 05:39 IST

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం

పథకానికి ప్రతిపాదించిన కోడూరు ఉన్నత పాఠశాల

న్యూస్‌టుడే, పోలాకి: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2026-27 వరకు విడతల వారీగా ఎంపికైన పాఠశాలలకు నిధులు విడుదల చేయనున్నారు. ఏటా రూ.40లక్షల చొప్పున అయిదేళ్లకు ఒక్కో పాఠశాలకు రూ.2 కోట్లు అందనున్నాయి. దీనికి సంబంధించి విద్యాశాఖాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలోని 30 మండలాల్లో ప్రాథమిక, ప్రాథ]మికోన్నత, ఉన్నత పాఠశాల చొప్పున 67 పాఠశాలల జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. తరువాత విద్యాశాఖ నుంచి ఎంపికైన పాఠశాలల్లోని పరిస్థితులు, వసతుల ఆధారంగా 60కిపైగా అంశాలతో కూడిన ప్రశ్నావళిని పాఠశాలలకు పంపారు. వీటిని అందుకున్న ప్రధానోపాధ్యాయులు తమకు అందిన ప్రశ్నావళికి బదులిస్తూ నివేదికను ఆన్‌లైన్‌లో సమర్పించారు. వీటిపై కేంద్రమే తుది జాబితా విడుదల చేస్తుందని సమగ్రశిక్ష అధికారులు తెలియజేస్తున్నారు. యూడైస్‌ ప్లస్‌, ఆన్‌లైన్‌ ప్రశ్నావళి నివేదికల ఆధారంగా పాఠశాలలు, గ్రామాలు 60, పట్టణాలు 70, మార్కులు సాధించాల్సి ఉంటుంది.


చేపట్టే కార్యక్రమాలు ఇవీ...

ఈ పథకానికి ఎంపికైతే ఆధునిక తరగతిగదులు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో తాగునీరు అందుబాటులోకి వస్తాయి. ప్రయోగశాల, డిజిటల్‌ గ్రంథాలయం, సౌర విద్యుత్తు, అంతర్జాల సౌకర్యం, వృత్తి విద్య అమలు, క్రీడాసామగ్రి, పర్యావరణం, ఆర్ట్‌ స్టుడియోలు, పోషకాహార తోటను ప్లాస్టిక్‌రహితంగా మార్చడం నాణ్యమైన విద్య అందించడం వంటి అంశాలు ఈ పాఠశాలల్లో అమలుచేస్తారు.


జాబితా పంపించాం: జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమర్పించిన అన్‌లైన్‌ నివేదిక ఆధారంగా అర్హత కలిగిన పాఠశాలల జాబితాలను పంపించాం. వీటిపై కేంద్రప్రభుత్వం, విద్యాశాఖ అధికారులే ఎంపిక చేస్తున్నారు. ఏప్రిల్‌ మొదటివారంలో కేంద్రం తుది ఫలితాలు విడుదల చేస్తుంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు పాటించడమే మా బాధ్యత. 

అనురాధ, ఏఎంవో, శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని