logo

నిఘా నీడలో పది పరీక్షలు

ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 30 Mar 2023 03:33 IST

జిల్లా విద్యాశాఖాధికారిణి జి.పగడాలమ్మ

న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం): ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్షల సామగ్రి, ప్రశ్నపత్రాలు చేరుకున్నాయి. మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారిని జి.పగడాలమ్మ తెలిపారు. ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చొని పరీక్ష రాసే పరిస్థితి రానీయకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. పది పరీక్షలకు సంబంధించి జిల్లాలో సన్నద్ధత గురించి ‘న్యూస్‌టుడే’కు ముఖాముఖిలో పలు అంశాలను వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే..


149 కేంద్రాల్లో..

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 149 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నాం. అందులో ప్రైవేటు పాఠశాలల కేంద్రాలు 56 ఉన్నాయి. మొత్తం 29,575 మంది పరీక్షలు రాయనున్నారు. వారిలో బాలురు 15,226 మంది, బాలికలు 14,349 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ విద్యార్థికి అసౌకర్యం కలగకుండా చూడాలని  ఇప్పటికే చీఫ్‌ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేశాం.


పక్కాగా ఏర్పాట్లు..

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశాం. ఇందుకు 70 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లను, 8 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను వేశాం. ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా చూడాలని ఆదేశించాం. గుర్తించిన 4 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. సీసీ కెమెరాలను ఏర్పాటు అందుబాటులో ఉంచాం.


ఉదయం 8.45కే రావాలి..

విద్యార్థులు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.45 గంటల కల్లా చేరుకోవాలి. పరీక్ష 9.30 గంటల నుంచి 12.45 వరకు ఉంటుంది. ప్రశ్నపత్రాల్లో మార్పులు ఉన్నందున ఆ మేరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. సైన్సుకు సంబంధించి భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం ఒకే పేపరుగా 100 మార్కులకు పరీక్ష రాయాలి. 12 పేజీలు చొప్పున రెండు వేర్వేరు బుక్‌లెట్లు, ఓఎంఆర్‌ షీట్లు ఇస్తాం.


అన్ని వసతులు ఉండేలా..

పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని ఇప్పటికే నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. తాగునీటి సౌకర్యాన్ని తప్పనిసరిగా కల్పించాలని, పూర్తిస్థాయిలో వెలుతురు అందేలా ఉండాలని సూచించాం. వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో కేంద్రాల వద్ద మెడికల్‌ కిట్‌ అందుబాటులో ఉంచుతాం. బందోబస్తు ఏర్పాట్లను పోలీసు శాఖ చూస్తుంది.


ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావొద్దు..

పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావొద్దు. సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు వంటి పరికరాలకు అనుమతి ఉండదు. ఎవరైనా తెచ్చినా బయటే ఆపేస్తాం. విద్యార్థులకు హాల్‌ టిక్కెట్ల విషయంలో, పరీక్షా కేంద్రాల విషయంలో ఏమైనా సందేహాలుంటే 95056 78655 నంబరును సంప్రదించవచ్చు.


సార్వత్రిక పరీక్షలకూ సన్నద్ధం

జిల్లాలో పది, ఇంటర్మీడియట్ సార్వత్రిక పరీక్షలకు సన్నద్ధమవుతున్నాం. అవి ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 17 వరకు జరుగుతాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పదో తరగతికి 6, ఇంటర్‌కు 7 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.


ఉచితంగా బస్సు ప్రయాణం

అరసవల్లి: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. కేంద్రాలకు వెళ్లి, వచ్చే సమయాల్లో పరీక్షల హాల్‌టిక్కెట్‌ను విద్యార్థులు బస్సులోని ఆర్టీసీ సిబ్బందికి చూపించి ప్రయాణించవచ్చునని ఒకటో డిపో మేనేజర్‌ మాధవ్‌ బుధవారం తెలిపారు. జిల్లాలోని అన్ని రూట్లలో ఈ సదుపాయం ఉంటుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని