logo

ప్రతిభ చూపుతూ.. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ..!

జపనీస్‌ యుద్ధకళల్లో ఒకటైన ‘జూడో’లో సిక్కోలు క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు.

Published : 02 Jun 2023 05:57 IST

జూడోలో రాణిస్తున్న సిక్కోలు క్రీడాకారులు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌: జపనీస్‌ యుద్ధకళల్లో ఒకటైన ‘జూడో’లో సిక్కోలు క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నారు. 2013లో అనంతపురం ఆర్టీడీలో జపాన్‌ శిక్షకుడి వద్ద తర్ఫీదు పొందిన క్రీడాకారులు పులఖండం శాంతా మణికుమార్‌, పైడి సునీత జిల్లాలోని శ్రీకాకుళం, జలుమూరు(చల్లవానిపేట) పొందూరు(తాడివలస), ఎచ్చెర్ల(కేశవరావుపేట, పొన్నాడ)లో 800 మంది క్రీడాకారులకు డీఏస్‌ఏ సహకారంతో అసోసియేషన్‌ తరఫున జూడో నేర్పిస్తున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 500 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇటీవల అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌-19 జూడో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస పతకాలతో పాటు ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో ద్వితీయస్థానాన్ని సొంతం చేసుకున్నారు. నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారి ప్రతిభపై ‘న్యూస్‌టుడే’ కథనం..

తొలిసారి జాతీయస్థాయికి..

శ్రీకాకుళం నగరానికి చెందిన సింగూరు యశ్వంత్‌కుమార్‌ స్థానిక ఆర్‌సీఎం లయోలా పాఠశాలలలో పదో తరగతి పూర్తి చేశాను. నాన్న సింహాచలం జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో కబడ్డీ శిక్షకుడు. అమ్మ ప్రభావతి గృహిణి. అయిదేళ్లుగా జూడోలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం, 3 రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. తొలిసారి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఎలాగైనా సత్తా చాటాలని సాధన చేస్తున్నాడు.

ఇద్దరూ ఇద్దరే..

శ్రీకాకుళం నగరానికి చెందిన కడపల వసంత్‌కుమార్‌, కడపల సౌమ్యారాణి అన్నాచెల్లెలు. ఇద్దరూ జూడోలో రాణిస్తున్నారు. తండ్రి శంకరనారాయణ కూలీ. తల్లి కృష్ణవేణి ఆశ కార్యకర్తగా చేస్తున్నారు. సౌమ్యారాణి స్థానిక వరం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. ఇప్పటివరకు జాతీయస్థాయి పోటీల్లో 2 స్వర్ణాలు, రజతం, కాంస్య పతకం, రాష్ట్రస్థాయిలో 7 బంగారు పతకాలు పొందింది. వసంతకుమార్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రాష్ట్రస్థాయిలో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 1 వెండి పతకాలు పొంది తొలిసారి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. బంగారు పతకమే లక్ష్యంగా ఇద్దరూ నిత్యం అయిదారు గంటలు మైదానంలో సాధన చేస్తున్నారు.

ఇటు ఆట.. అటు చదువు..

పొందూరు మండలానికి చెందిన కింబూరి పవన్‌    కుమార్‌ తాడివలస జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు అప్పారావు, పద్మావతి వ్యవసాయ కూలీలు. ఓ వైపు చదువులో ముందువరుసలో ఉంటూనే.. తల్లిదండ్రులు ప్రోత్సాహాంతో ఆటల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నాడు. వ్యాయామోపాధ్యాయరాలు సునీత జూడోలో శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో తొలిసారి రజత పతకం, రెండోసారి స్వర్ణపతకం పొందాడు. క్రీడాకోటాను సద్వినియోగం చేసుకొని రక్షణ దళాల్లో కొలువు సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు పవన్‌కుమార్‌.

వసతులతో ఉత్తమ ఫలితాలు..

జిల్లాలో సామర్థ్యం కలిగిన క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. వేసవి శిక్షణ శిబిరాల్లో సరదాగా ఆట నేర్చుకుంటున్నవారు నిరంతరం సాధన కొనసాగించి జాతీయ, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. నగరంలోని ఇండోర్‌ మైదానం పూర్తయి.. మరిన్ని వసతులు అందుబాటులోనికి వస్తే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది.

పులఖండం శాంతా మణికుమార్‌, జూడో శిక్షకుడు, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని