logo

వినిపించని తీపి కబురు..!

వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా నేటికీ ఆ హామీని నెరవేర్చకపోవడంతో ఇంకెప్పుడు తీరుస్తారని చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 07 Jun 2023 06:35 IST

 ఎదురుచూస్తున్న చక్కెర కర్మాగారం రైతులు

ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నెరవేరని పరిస్థితి

న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

ఆమదాలవలసలో మూతపడిన చక్కెర కర్మాగారం

‘మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మూతపడిన చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం.  రైతులు, శాశ్వత ఉద్యోగుల ఆశలన్నీ నెరవేరుస్తాం..’
ఇదీ... పాదయాత్రలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమదాలవలసలోని కొత్తకోట వారి వీధి జంక్షన్‌ వద్ద ఇచ్చిన హామీ.

... వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా నేటికీ ఆ హామీని నెరవేర్చకపోవడంతో ఇంకెప్పుడు తీరుస్తారని చెరకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలసలోని చక్కెర కర్మాగారం ద్వారా వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలిగేది. చుట్టుపక్కల ఉన్న 8 మండలాల రైతులకు ఇదే ఆధారం. ఓ వెలుగు   వెలిగిన సహకార చక్కెర కర్మాగారం మూత     పడటంతో రైతులు, ఉద్యోగస్థులు, కూలీలు, కార్మికులు పనులు లేక వలసబాట పట్టారు.

‘బొడ్డేపల్లి’ కృషితో ఏర్పాటు

కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో అప్పటి శ్రీకాకుళం ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు కృషితో ఆమదాలవలస చక్కెర కర్మాగారం 1962లో ఏర్పడింది. ఈ సీజన్‌లో మొట్టమొదటిసారి  చెరకును ఆడారు. దేశంలో అత్యున్నత కర్మాగారంగా తీర్చిదిద్దడానికి ఆయన ఎంతో కృషి చేసి సహకార కర్మాగారంగా లాభాల బాటలో నడిచేలా చూశారు. కానీ, ఏమైందో ఏమో గాని నష్టాల్లో ఉందని చూపించి 2004లో చక్కెర  కర్మాగారాన్ని మూసివేశారు.

ప్రైవేటు సంస్థకు అమ్మకం  

బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి 2004లో ఈ కర్మాగారాన్ని రూ.6.20 కోట్లకు అమ్మేశారు. అప్పటి కర్మాగారం ఛైర్మన్‌గా స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోదరుడు తమ్మినేని శ్యామలరావు ఉండేవారు. దీని అమ్మకానికి వీల్లేదని 2003-2004 సీజన్‌లో నడపాలని డిమాండు చేస్తూ అప్పటి రైతుల మహాజన సభలో తీర్మానించారు. అమ్మకం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  కొంతమంది కర్మాగార షేర్‌ హోల్డర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సహకార రంగంలో నడిపించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునకు వ్యతిరేకంగా కర్మాగార భూములను ఏపీఐఐసీకి అప్పగించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ భూములు అమ్మి ప్రైవేటు సంస్థకు వడ్డీతో సహా చెల్లించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
* కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తే జిల్లాలోని పలు మండలాల రైతులు చెరకును పండించి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
* కర్మాగారాన్ని తెరిపించడానికి ఉన్న అవకాశాలు, దానికి అందించాల్సిన ఆర్థిక సహాయంపై ప్రభుత్వానికి నివేదించేందుకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి నిపుణులు గురువారెడ్డి, ఇంజినీరింగ్‌ నిపుణులు వై.వి.చౌదరి, గోపాలకృష్ణతో ఏర్పడిన త్రిసభ్య కమిటీ 2020 ఫిబ్రవరి 2న పరిశీలించారు. కానీ ఇప్పటివరకూ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
* రైతులు తరువాత ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు అందించడంతో 2021 ఆగస్టులో పరిశీలించి కర్మాగారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించడంతో ఆయన వివరాలు సమర్పించారు. 2021లో ఏపీఐఐసీకి చెందిన ఓఎస్‌డీ అజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, ఆజాద్‌లతో కూడిన బృందం వచ్చి కర్మాగారం, భూముల వివరాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించారు.


ఇప్పటికైనా తెరిపించండి

ఈ కర్మాగార సమస్యను ఏ ప్రభుత్వం వచ్చినా పరిష్కరించడం లేదు. ప్రతీ ఎన్నికల్లో  తమ అభ్యర్థిని గెలిపిస్తే తెరిపిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదు. గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినా  ఇంతవరకూ ఏ చర్యలు చేపట్టలేదు.
 ఊసా రమణ, చక్కెర కర్మాగారం షేర్‌హోల్డర్‌, ఆమదాలవలస


ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి

చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని రైతులు కోరుతున్నారు. వారి విజ్ఞప్తులు ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా నివేదించాం. ప్రభుత్వ నిపుణుల బృందం వచ్చి పరిశీలించి వెళ్లాక రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం కర్మాగారాన్ని తెరిపించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీన్ని తెరిపిస్తే రైతులకు ఎంతో మేలు.
మురళీకృష్ణ, ఎండీ, ఆమదాలవలస చక్కెర కర్మాగారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని