logo

ఇల్లు ఖాళీ చేయాలని దౌర్జన్యం!

కాలనీ ఇల్లు ఖాళీ చేయాలని హనుమంతునాయుడుపేట సర్పంచి ప్రతినిధి అనుచరులు ఓ పేద కుటుంబంపై మంగళవారం దౌర్జన్యం చేశారు.

Updated : 07 Jun 2023 06:29 IST

వైకాపా సర్పంచి ప్రతినిధి అనుచరుల బెదిరింపులు

ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బాధిత కుటుంబం ఆత్మహత్యాయత్నం

నౌపడ పోలీసుస్టేషన్‌ వద్ద ఈశ్వరరావు కుటుంబ సభ్యులు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: కాలనీ ఇల్లు ఖాళీ చేయాలని హనుమంతునాయుడుపేట సర్పంచి ప్రతినిధి అనుచరులు ఓ పేద కుటుంబంపై మంగళవారం దౌర్జన్యం చేశారు. దీంతో బాధిత కుటుంబం ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలంలోని హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట గ్రామంలో బేపల ఈశ్వరరావు కుటుంబ సభ్యులు 15 ఏళ్లుగా ఓ పూరింట్లో నివాసముంటున్నారు. ఆ ఇల్లు ఖాళీ చేయాలని సర్పంచి ప్రతినిధి పాల మహేష్‌తో పాటు అతని అనుచరులు బెదిరించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఏప్రిల్‌ 7న నౌపడ పోలీసులకు ఆశ్రయించారు. దీంతో ఇరువర్గాలపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు ఆ ఇంటి స్థలానికి పొజిషన్‌ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. మళ్లీ మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబ సభ్యులతో ఈ వివాదం విషయమై హనుమంతునాయుడుపేట పంచాయతీ పెద్ద మనుషులు, టెక్కలి నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి ఆదేశాలతో మండల వైకాపా ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ సభ్యుడు పాల వసంతరెడ్డి, ఎంపీపీ ప్రతినిధి మెరుగు అప్పారావు, వైకాపా మండల అధ్యక్షుడు కోత సతీష్‌, నక్క భీమారావు, మేనకేతన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఇరువర్గాల వాదనలు విని సమస్య పరిష్కారానికి వారు చొరవ చూపారు. ఈ సందర్భంగా వైకాపా మండల ప్రజాప్రతినిధుల సమక్షంలోనే సర్పంచి ప్రతినిధి మహేష్‌ అనుచరులు కొందరు బెదిరించడంతో పాటు ఆ ఇంటి రేకులు, దూలలు తొలగించడానికి ప్రయత్నించారు. మనస్తాపానికి గురైన ఈశ్వరరావు, కవిత కిరోసిన్‌ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు నౌపడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఇంటి రేకులు తొలగిస్తున్నప్పుడు వీడియోలు తీయడంతో చరవాణిని దౌర్జన్యంగా తీసుకున్నారని, ఇంటి స్థలానికి పొజిషన్‌ ధ్రువీకరణ పత్రం ఉందని, దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినా దౌర్జన్యంగా ఇల్లును తొలగించడానికి సర్పంచి అనుచరులు ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపించారు. దీనిపై సర్పంచి ప్రతినిధిమహేష్‌ను వివరణ కోరగా ఆ కుటుంబానికి ఇల్లు మంజూరు కావడంతో డాబా ఇల్లు కట్టుకున్నారని, అక్కడికి వెళ్లమని చెప్పాం తప్పా దౌర్జన్యం చేయలేదన్నారు. దీనిపై ఎస్సై కిశోర్‌వర్మ మాట్లాడుతూ పోతునాయుడుపేటలో ఇంటి స్థలం సమస్య ఎప్పటి నుంచో ఉందని, దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారని, ఇప్పటివరకు బాధితుల చరవాణిని తీసుకున్నట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని