logo

వేట సాగక.. పూట గడవక..!

జిల్లాలోని గంగపుత్రులకు రాయితీ బెంగ పట్టుకుంది. రోజురోజుకీ డీజిల్‌ ధర పెరుగుతున్నా రాయితీ మొత్తం పెంచకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

Updated : 18 Sep 2023 06:27 IST

డీజిల్‌ ధర రెట్టింపైనా పెరగని రాయితీ
 కష్టాల కడలిలో గంగపుత్రులు

భావనపాడులో వేటకు వెళ్లకపోవడంతో ఒడ్డున నిలిపిన పడవలు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: జిల్లాలోని గంగపుత్రులకు రాయితీ బెంగ పట్టుకుంది. రోజురోజుకీ డీజిల్‌ ధర పెరుగుతున్నా రాయితీ మొత్తం పెంచకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇచ్ఛాపురం, కవిటి, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, గార, పోలాకి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలాల పరిధిలోని 104 గ్రామాల్లో దాదాపు 3,585 రిజిస్టర్‌ బోట్లు ఉన్నాయి. వీటిపై 14,280 మంది మత్స్యకారులు నిత్యం చేపల వేటకు వెళ్తున్నారు. చిన్న పడవలపై ఆధారపడి మరో 8,000 మంది ఉన్నారు. వీరంతా సముద్రంలో అలజడి లేకపోతేనే వేటకు వెళ్తారు. లేకపోతే పస్తులే. ప్రస్తుతం సముద్రం వాయుగుండాలతో అల్లకల్లోలంగా మారడంతో వేటకు వెళ్లే పరిస్థితి లేదు. ఏటా సెప్టెంబరు నుంచి జనవరి వరకు వేటకు మంచి సీజన్‌. ఈ నెలల్లో చేపలు బాగా పడతాయి. మిగిలిన నెలల్లో నామమాత్రంగా వేట సాగినా ఇబ్బందులు తీరుతాయి. సముద్రంలో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చేపల ధరలు తగ్గుదల వారి జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నాయి.  దీంతో రాయితీ ఇంధనాన్ని పెంచి ప్రభుత్వం ఆదుకోవాలని   వేడుకొంటున్నారు.

రాయితీ లీటరుకు రూ.15 పెంచాలి

మత్స్యకారులు బోటు నడిపేందుకు వాడే ఇంధనానికి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. డీజిల్‌ ధర పెరిగినా గానీ ప్రభుత్వం  రాయితీ పెంచడం లేదు. డీజిల్‌ ధర రూ.50 ఉన్నప్పుడు ఇచ్చిన రాయితీనే, ధర రూ.100  అయినపుడు  అంతే ఇస్తున్నారు. దీంతో వేట ఇబ్బందిగా మారి నష్టాలు మిగులుస్తుంది. ప్రభుత్వం లీటరుకు ఇస్తున్న రాయితీ రూ.6 నుంచి రూ.15 కు పెంచాలని, మోటరైజ్డ్‌ బోట్లకు నెలకు ఇచ్చే రాయితీ ఇంధనం 300 లీటర్ల నుంచి 600  లీటర్లకు, మెకనైజ్డ్‌ బోట్లకు ఇచ్చే 3వేల లీటర్ల ఇంధనాన్ని 5 వేల లీటర్లకు పెంచాలని కోరుతున్నారు. దీనివల్ల కొంతమేర ఇబ్బందులు తొలగుతాయని చెబుతున్నారు.

కష్టం దళారుల పాలు

వేట లేని సమయంలో మత్స్యకారుల అవసరాలకు దళారులు అప్పులు ఇస్తుంటారు. దీనికి బదులుగా చేపలను వారికే ఇవ్వాలన్న నిబంధన పెడతారు. లేకపోతే కులం కట్టుబాటు ప్రకారం జరిమానా విధిస్తారు. మార్కెట్‌లో కిలో రూ.300 పలుకుతున్న చేపల్ని దళారులకు రూ.150కి   అప్పజెప్పాల్సిందే. వేట లేని సమయంలో ప్రభుత్వం రుణాలిచ్చి ఆదుకుంటే ఈ పరిస్థితి ఉండదని మత్స్యకారులు చెబుతున్నారు. మత్స్యకార సొసైటీలు మరుగునపడటంతో రుణాలు అందించడంలేదు. మత్స్యశాఖాధికారులు సొసైటీల పునరుద్ధరణకు ఏ చర్యలు తీసుకోవడం లేదు.


బోటు నడపాలంటే కష్టమే

ప్రస్తుతం చేపలు దొరక్క ఆదాయం పడిపోయింది. ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో బోటు నడపాలంటే కష్టంగా మారింది. ముఖ్యంగా పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి ఇంధనం రాయితీని పెంచాలి.

యర్రయ్య, భావనపాడు, మత్స్యకారుడు


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా

మత్స్యకారులు బోటు నడిపేందుకు వాడే ఇంధనానికి ప్రభుత్వం రూ.9 రాయితీ ఇస్తోంది.  మోటరైజ్‌ బోట్లకు నెలకు 300 లీటర్ల డీజిల్‌ రాయితీ ఇంధనం ఇస్తోంది. ధరలు పెరిగాయని, రాయితీ పెంచాలని పలువురు మత్స్యకారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.

ధర్మరాజు పాత్ర్‌, ఎఫ్‌డీఓ, టెక్కలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని